WTC Final Countdown: 7 Days To Go....కోహ్లీ వర్సెస్ కేన్ మామ....తెలుగులో కామెంటరీ
లండన్: సరిగ్గా వారం రోజులు..టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం ఆరంభం కాబోతోంది. చిరస్మరణీయంగా నిలిచిపోయే ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC final) ఇంకొద్ది రోజుల్లో ఆరంభం కాబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ కోసం ఈ 18వ తేదీన ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్లోని రోజ్ బౌల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ తలపడబోతోన్నాయి. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు టాస్ కోసం కాయిన్ గాల్లోకి లేస్తుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయర్లు ఇప్పటికే సౌథాంప్టన్ చేరుకున్నారు. న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది.
Covaxin: భారత్ బయోటెక్కు ఎదురుదెబ్బ: ఆ వినియోగానికి అమెరికా రెడ్ సిగ్నల్
టెస్ట్ మ్యాచే అయినప్పటికీ
అయిదురోజుల పాటు సుదీర్ఘంగా సాగే టెస్ట్ క్రికెట్టే అయినప్పటికీ- అందరి కళ్లూ ఆ మ్యాచ్ మీదే నిలవడానికి కారణం.. ఈ ఫార్మట్లో తొలిసారిగా ఛాంపియన్షిప్ను ఏర్పాటు చేయడమే. టెస్ట్ క్రికెట్ ఆడే హోదా ఉన్న అన్ని జట్లూ ఇందులో పాల్గొన్నాయి. అత్యధిక పాయింట్లను సొంతం చేసుకున్న టీమిండియా, కివీస్ జట్లు ఫైనల్కు చేరాయి. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుపై నాలుగు టెస్ట్ సిరీస్లను 3-1 తేడాతో గెలుచుకోవడం ద్వారా కోహ్లీసేన ఈ ఫైనల్లో అడుగు పెట్టింది. కోహ్లీసేన ఖాతాలో మొత్తం 72.2 శాతం పాయింట్లు ఉన్నాయి. 70 పాయింట్లతో కివీస్ రెండో స్థానంలో నిలిచి, ఫైనల్కు అర్హత పొందింది.
టెలికాస్ట్ చేసే ఛానల్..
ఈ మ్యాచ్ను ప్రసారం చేసే హక్కులను స్టార్ నెట్వర్క్ పొందింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అఫీషియల్ బ్రాడ్కాస్ట్ పార్ట్నర్ స్టార్ స్పోర్ట్స్ దీన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. స్టార్ నెట్వర్క్ గ్రూప్లోని ఏడు వేర్వేరు ఛానళ్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. అయిదు భాషల్లో కామెంటరీని వినొచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు మూడు ప్రాంతీయ భాషలు తెలుగు, తమిళం, కన్నడల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కామెంటరీని వినొచ్చు. ఆయా ప్రాంతీయ భాషల్లో స్టార్ నెట్వర్క్ ఛానళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. దక్షిణాది భాషలనే ఎంచుకుందా స్పోర్ట్స్ నెట్వర్క్ గ్రూప్ యాజమాన్యం.
ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్
సాధారణంగా ఓ క్రికెట్ టీమ్.. మరో దేశ పర్యటనకు వెళ్తే.. అక్కడి ప్రెసిడెంట్స్ లెవెన్తో వామప్ మ్యాచ్లను ఆడుతుంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల వల్ల వామప్ మ్యాచ్లను నిర్వహించట్లేదు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. బయో సెక్యూర్ బబుల్లో గడపాల్సి ఉన్నందున వామప్ల జోలికి వెళ్లలేదు. అయినప్పటికీ- ఓ ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ను నిర్వహించనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ సన్నాహకంగా.. ఈ మ్యాచ్ను ఆడబోతోంది కోహ్లీసేన. అక్కడి కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం మ్యాచ్ ఆరంభమౌతుంది. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలు ఉండవు.
2018లో చివరిసారిగా వామప్
2018లో చివరిసారిగా టీమిండియా వామప్ మ్యాచ్లను ఆడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఎస్సెక్స్ టీమ్తో మూడు రోజుల వామప్ మ్యాచ్ను ఆడిందీ జట్టు. ఆ తరువాత వాటి జోలికి వెళ్లట్లేదు. అయినప్పటికీ- ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్.. భారత ఆటగాళ్లు గాడిన పడటానికి ఉపయోగపడుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఒక్కసారి కుదురుకుంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించడం ఖాయం. న్యూజిలాండ్.. సన్నాహకంగా ఏకంగా ఇంగ్లాండ్ జాతీయ జట్టుతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్ డ్రా ముగియగా..రెండో మ్యాచ్ కొనసాగుతోంది.