అన్నా హజారే అరెస్టును ఖండిస్తూ ఎన్నారైల ప్రకటన
అవినీతికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఉద్యమిస్తున్న గాంధేయవాది అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ , కిరణ్ బేడీ మరియు మనీష్ సిసోడియాలను కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఢిల్లీ లోని జే.పీ పార్కులో శాంతియుతం గా నిరాహార దీక్ష చేద్దామని అన్నా హజారే అనుమతి కోరారు. దానికి పోలీసులు సవాలక్ష ఆంక్షలు పెట్టారు. నిరాహారదీక్ష మొదలు పెట్టక ముందే అరెస్టు చేసారు. యీ సంఘటన, కాంగ్రెసు ప్రభుత్వ అసహనాన్ని, నిరంకుశ ధోరణి, అప్రజాస్వామిక స్వభావాన్ని తెలియ చేస్తుంది.
2జీ-టెలికాం కుంభకోణం, కామన్ వెల్త్ కుంభకోణం, పార్లమెంటు ఓట్లు కొనటం కుంభకోణాలలో కాంగ్రెసు ప్రభుత్వం కూరుకుపోయింది. కర్ణాటక లోని బిజేపీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో కుప్పకూలింది. యీ ప్రభుత్వాలు ప్రజలలో విశ్వసనీయత కోల్పోతున్నాయి. అవినీతి నిర్మూలించటానికి 'లోక్ జనపాల్" చట్టాన్ని తేవాలని అన్నా హజారే డిమాండ్ చేసారు. అన్నా, ప్రశాంత భూషణ్, శాంతి భూషణ్ రాసిన లోక్ జనపాల్ బిల్లు ప్రతిని కేంద్ర ప్రభుత్వం చెత్త బుట్ట వేసి, ఒక బలహీనమైన లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు లోకి ప్రవేశ పెట్టింది.
సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలం అయినప్పుడు, ఉద్యమించే హక్కు ప్రజలకు వుంది. ఏ ప్రజాస్వామిక వ్యవస్థలోనైనా నిరసన తెలిపే హక్కు ప్రజలకు వుంటుంది. ఊరేగింపు, బహిరంగసభ, నిరాహారదీక్ష, బంద్, ఆర్ధిక దిగ్బంధం, సాంఘిక బహిష్కరణ లాంటి అనేక రూపాల్లో నిరసన ఉండవచ్చు. ప్రభుత్వం రాజకీయంగా సమస్యలను పరిష్కరించకుండా, పోలీసు బలగాలతో ప్రజా ఉద్యమాలను అణచి వేయటం, అరెస్టులు, లాఠీచార్జీలు జరపటం ప్రజాస్వామిక హక్కులను కాలరాయటం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను కేంద్ర మంత్రులు చిదంబర రహస్యం, కపిల్ సిబల్ ప్రెస్ కాన్ఫెరెన్సులు పెట్టి సమర్థిస్తున్నారు.
విద్యార్థులు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు, దళితులు, మైనార్టీలు, ప్రవాస భారతీయులు మరియు ప్రజాస్వామిక వాదులందరూ కాంగ్రెసు ప్రభుత్వ దుర్మార్గాలను ఖండించ వలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నా హజారే మరియు ఇతరులపైన పెట్టిన పోలీసు కేసులు వెంటనే ఎత్తివేసి, ఢిల్లీ లో స్వేచ్ఛ గా నిరసన తెలిపే అవకాశం కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనను తక్షణమే ఆపివేసి, ప్రజాస్వామిక హక్కులను ఆచరణలో గౌరవించాలి.
- అనిల్ యార్లగడ్డ డల్లాస్, టెక్సస్, నాగమణి కొల్కోజస్, సుబ్బారెడ్డి, సాంబ, గోపి కందుకూరి, లక్ష్మీనారాయణ, రాణి, యుగంధర్, చంద్రమోహన్, శ్రీనివాస్ మండవ, సీతా రామయ్య, దినేష్. టి, సురేష్. జి, హరి ప్రసాద్, సతీష్ బండారు, కే. చైతన్య, సాజీ గోపాల్, చుక్కా శ్రీనివాస్.