దుబాయ్లో తెలుగువాడి ఆత్మహత్య
శ్రీనివాస్ ఆత్మహత్యకు గల కారణాలేమిటనేది పోలీసులు చెప్పలేకపోతున్నారు. అయితే, అతను ఆత్మహత్య చేసుకునేంతటి పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు. శ్రీనివాస్ మృతిపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ మరణ వార్త విన్న వెంటనే భార్య జ్యోతి స్పృహ తప్పి పడిపోయింది. అతని ఇద్దరి కుమారులను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు.
శ్రీనివాస్ స్వగ్రామం కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపాలెం. ఈయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉద్యోగం కోసం శ్రీనివాస్ 2008లో గల్ఫ్కు వెళ్లాడని, పిల్లలకు మంచి చదువులు చెప్పించాడని స్థానికులు అంటున్నారు. అతను అప్పులు కూడా తీర్చాడని, తన కుటుంబ సభ్యులకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వాలని ప్రయత్నించాడని అంటున్నారు.
శ్రీనివాస్ 2010లో స్వగ్రామం వచ్చి కుటుంబ సభ్యులతో రెండు నెలల పాటు ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి వెళ్లాడు. అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి సహాయం అందించాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.