తెలంగాణ సాంస్కృతిక సంబురం
డల్లాస్: డల్లాస్ ఏరియా తెలంగాణ సంఘం (డాటా) ఆధ్వర్యంలో డల్లాస్ తెలంగాణ సాంస్కృతిక సంబురాలు జరిగాయి. ఈ నెల 15వ తేదీ శనివారం జరిగిన ఈ సంబురాల్లో దాదాపు 600 మంది ఎన్నారైలు పాల్గొన్నారు. సంబురాలు నిర్వహించిన కేంద్రాన్ని, వేదికను తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అలంకరించారు. తెలంగాణకు చెందిన పది జిల్లాల సంస్కృతి ఉట్టిపడేలా తీర్చి దిద్దారు.
మోహన్ పడిగాల స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డిని వేదిక మీదికి ఆహ్వానించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకోవాల్సిన అవసరాన్ని శ్రీధర్ రెడ్డి వివరించారు. డాటా సభ్యుడు రఘువీర్ మర్రిపెద్ది తమ సంఘం లక్ష్యాలను, ఉద్దేశ్యాలను వివరించారు. తెలంగాణ సంస్కృతిని రక్షించుకుని, ప్రోత్సహించి మందు తరాలకు అందించడానికి తాము కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
గత మూడేళ్లుగా తాము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని, తెలంగాణ ఆవిష్కార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ సంఘం సభ్యులను ఆహ్వానించి పరిచయం చేశారు. అనిల్ బొద్దు, భాను చౌదరి, భాస్కర్ గార్లపాటి, హరీష్ మందాడి, కిరణ్ కె. చెలమల్ల, మహేందర్ గణపురం, మహేష్ మేరెడ్డి, నర్సింహారావు, రుఘవీరా మర్రిపెద్ది, రాజేష్ పిల్లమారి, రామ్ కాసర్ల, శేఖర్ బ్రహ్మదేవర, శ్రీనివాస్ రెడ్డి (బైక్), శ్రీనివాస్ దామెర, శ్రీనివాస్ మారం, శ్రీనివాస్ సూరకంటి, శ్రీనివాస్ తిప్పన్న, సుధీర్ గూడ, సురేష్ గొట్టి ముక్కల, వంశీ చామల, వెంకటేశ్వర్ రెడ్డి సేరి, వేణు అన్నపురెడ్డి, శ్రీధర్ దేవులపల్లి తదితరులను సభకు పరిచయం చేశారు.
తమ సేవా కార్యక్రమాలకు ఊతం ఇవ్వాలని సుధీర్ విజ్ఞప్తి చేశారు. తాము అందిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అభినయ కృష్ణ, వంశీ, ప్రియ, పద్మశ్రీలను రామ్ కాసర్ల పరిచయం చేశారు 72 మంది 14 విభాగాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. గేయాలాపన, నృత్యం వంటి ప్రదర్శనలు ఇచ్చారు. వంశీ ప్రియ తెలంగాణ జానపద గీతాలతో సభను ఉర్రూతలూగించారు. బతుకమ్మ, హోలీ పాటలకు మహిళలు నృత్యాలు చేశారు. మహేందర్ గణపవరం వందన సమర్పనతో కార్యక్రమం ముగిసిది.