సవిత కేసు: యుకెలో ఎన్నారైల ప్రదర్శన
లండన్: ఐర్లాండ్లో వైద్యులు అబార్షన్ నిరాకరించడంతో మరణించిన సవితా హలప్పనవార్కు సంతాపం ప్రకటిస్తూ యునైటెడ్ కింగ్డమ్ లీసెస్టర్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం వద్ద దాదాపు 50 మంది ఎన్నారైలు ఈ నెల 18వ తేదీన ప్రదర్శన నిర్వహించారు. నెవర్ అగైన్, నెవర్ అగైన్, చేంజ్ ద రూల్స్ - సేవ్ ద వుమెన్, సవిత డిజర్వ్స్ బెట్టర్ - సో ఆల్ వుమెన్ డూ వంటి నినాదాలు చేశారు.

మీడియా ప్రవాసీ భారత్ కార్యదర్శి చీకా చంద్రశేఖర్ ప్రదర్శనకు నాయకత్వం వహించారు. సవిత మృతికి సంతాపసూచకంగా ఓ నిమిషం పాటు ఎన్నారైలు మౌనం పాటించారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరాన్ని చీకా చంద్రశేఖర్ నొక్కి చెబుతూ అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారవర్గాలను డిమాండ్ చేశారు.
మానవ జీవితం ప్రాధాన్యాన్ని వివరిస్తూ మనిషి ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన నిబంధనలను మార్చాలని ప్రవాసీ భారత్ కోర్ మెంబర్ ఫిరోజ్ ఖాన్ అన్నారు. మత ప్రాతిపదికపై నియమాలు ఉండకూడదని, ప్రజల ప్రాణాలను రక్షించడానికి చట్టాలు ఉండాలని ఆయన అన్నారు. అబార్షన్, ప్రెగ్నెన్సీ నిబంధనలను మార్చాలని ఆయన ఐర్లాండ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఆధునిక శాస్త్ర విజ్ఝానం అందుబాటులోకి వచ్చిన వైద్య సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో ఆధునిక దేశాల్లోని వైద్యులు మనిషి జీవితాలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుని ఉండాల్సిందని బిజల్ భగ్వాన్ అన్నారు. ఇరువురి ప్రాణాలు పోయే స్థితిలో తల్లి ప్రాణాలనైనా రక్షించి ఉండాల్సిందని అన్నారు.
ఐర్లాండులో సవిత మరణించిన తీరు పట్ల ప్రవాసీ భారత్ చైర్మన్ నాగేందర్ చిందం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విదేశాల్లో భారతీయుల ప్రాథమిక హక్కుల రక్షణ కోసం తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. అబార్షన్ను తాము బలపరచబోమని, అయితే, తల్లి ప్రాణాలకే ముప్పు ఉన్నప్పుడు నైతికంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు.
మనిషి జీవితం అత్యంత విలువైందని, గర్భంలో శిశువును మోస్తున్న తల్లికి ఆ సయమం ఎంతో కఠినమైందని, శిశువు ప్రాణాలతో పుట్టదని తెలిసినప్పుడు అబార్షన్ చేయించుకునే హక్కు మహిళకు ఉండాలని హరి నవాపేట్ అన్నారు.












Click it and Unblock the Notifications