అమెరికాలో గురజాడ అడుగుజాడలు

ముందుగా అన్నవరపు రంగనాయకులు - "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి కొన్ని ప్రసిద్ధ పద్యాలను రాగయుక్తం గా పాడి వినిపించారు. వేదికమీద వీరు కేవలం తెలుగుభాషలోనే మాట్లాడటం చాల మందికి ఆదర్శప్రాయమని సభికులు తమ అభిప్రాయం తెలియచేశారు. తరువాత, ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, సాజి గోపాల్ ప్రస్తుతం హైదరాబాద్ లోని చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయాల మీద జరుగుతున్న వివాదాన్ని హైదరాబాద్ అనే తన స్వీయ కవిత చదివి తన అభిప్రాయాలను సభికులకు తెలియజేశారు.
ప్రముఖ ప్రగతిశీల ముస్లిం కవి షేక్ కరీముల్లా వ్రాసిన ‘ఈద్ ముబారక్" అనే కవితా సంకలనం నుండి పాలస్తీనా పాతబస్తీ, జాతీయ గీతం మొదలైన అంశాలగురించిన కవితలు మల్లవరపు అనంత్ చదివి వినిపించారు. కవిత్వం రాయటం చాల కష్టమని, కవిత్వం రాసే ప్రక్రియ లో ఒక కవి ఎదుర్కొనే ఒత్తిడి గురించి ప్రముఖ ప్రవాస కవి శ్రీ విన్నకోట రవిశంకర్ రాసిన పుస్తకం "రెండో పాత్ర" నుండి ప్రముఖ స్థానిక రచయిత కన్నెగంటి చంద్ర కొన్ని కవితలను చదివి వినిపించారు.
తరువాత ప్రధాన వక్త పాలూరి సుజనని పరిచయంచేస్తూ జువ్వాడి రమణ - సుజన సాహితీ వ్యాసంగం గురించి సభికులకు తెలియచేసారు. పండితుల కుటుంబంలో పుట్టిన సుజనకు చిన్నప్పటి నుండి పుస్తక పఠనం మిద గల ఆసక్తి సాహిత్యాభిలాష ను కలగజేసిందని, చిన్నప్పుడే శ్రీశ్రీ, తిలక్, విశ్వనాధ వారి రచనలను చదివేసారని, జాతీయ స్థాయిలో వకృత్వ పోటీలలో గుర్తింపు పొందారని వివరించారు. గత 12 సంవత్సరాలుగా డల్లాస్ లో ఉంటూ ప్రిజం అకాడమి లో పిల్లలలకు చదువు చెబుతున్న సుజనను వేదికపైకి ఆహ్వానించగా, శ్రీమతి భట్రాజు రాణి పుష్పగుచ్చం తో స్వాగతం పలికారు.
అనంతరం శ్రీమతి సుజన పాలూరి - "గురజాడ అడుగుజాడలు" అనే అంశం మిద ప్రసంగించారు. 3000 వేల సంవత్సరాల చరిత్ర గల తెలుగు భాష లో, సాహిత్యంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు ఆద్యులు నన్నయ, గురజాడ అని, ఆధునిక సాహిత్యం లో వాడుక భాషను ఉపయోగించడంలో గురజాడ నాంది పలికారు అన్నారు. సాహిత్యం ద్వారా సమాజం లోని దురాచారాలను నిరూపించడం ఎలాగో కన్యాశుల్కం నాటకం ప్రపంచానికి చాటి చెప్పారని, బాల్య వివాహాల ద్వారా పసిపిల్లలను, పుట్టబోయే పిల్లలను అమ్మడం పశుమాంసం అమ్మడం కన్న హీనమైన చర్య అని, ఈ శిశు మాంసం అమ్మకాలను తన రచనతో రూపుమాపటం, నిజంగా సంఘ సమస్యలను నిర్మూలించడంలో గురజాడ గారి సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు.
సాహిత్యంతో సంఘ సంస్కరణ మాత్రమే కాకుండా, సంస్కృత ప్రభావంతో పండితుల భాషగా చెలామణి అవుతున్న తెలుగు భాషను సరళీకరించి సామాన్యులు మాట్లాడే భాషైన వాడుక భాషకు గిడుగు రామ్మూర్తి పంతులుతో కలిసి కల్పించిన ప్రాచుర్యం, తెలుగు సాహిత్యానికి వెల కట్టలేని బహుమతి అని అన్నారు. ఇంకా గురజాడ జీవిత విశేషాలను, ఆయన చేసిన ఇతర రచనలను ఎంతో వివరంగా సభికులతో పంచుకున్నారు. గురజాడ అంతటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అవకాశం తనకు రావడం చాల సంతోషకరమైన విషయమని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన సాహిత్య వేదికకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీమతి దమ్మన్నగీత, పాలక మండలి ఉపాదిపతి డా. సి.ఆర్.రావు శాలువాతో ముఖ్య అతిథి శ్రీమతి సుజన పాలూరిని సత్కరించారు. సాహిత్య వేదిక సభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, మద్దుకూరి విజయ చంద్రహాస్ , డా.ఊరిమిండి నరసింహా రెడ్డి, మల్లవరపు అనంత్, డా.జువ్వాడి రమణ, నసీం షేక్, బిల్లా ప్రవీణ్ లు ముఖ్య అతిథికి జ్ఞాపికను అంద చేసారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు మండువ సురేష్,తానా అధ్యక్షులు తోటకూర ప్రసాదు, స్థానిక సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications