లండన్లోనూ తెలంగాణ మార్చ్
తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ పిలుపు మేరకు తెలంగాణ ప్రజలకు మద్దతుగా సెంట్రల్ లండన్లో మహాత్మా గాంధీ విగ్రహం నుంచి నెహ్రూ విగ్రహం వరకు మూడు కిలోమీటర్ల మేర సెప్టెంబర్ 30వ తేదీన పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్ చెప్పారు.
దానికి సంబంధించిన పోస్టర్ను తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ శుక్రవారం హైదరాబాదులో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు వి శ్రీనివాస గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి. విఠల్, పివోడబ్ల్యు నేత సంధ్య, బిసి సంఘం అధ్యక్షుడు రామరాథ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం లండన్లో చేసే కార్యక్రమాలు గర్వించదగ్గవని, విదేశాల్లో ఉంటూ తెలంగాణ పట్ల చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని కోదండరామ్ ఈ సందర్భంగా అన్నారు. సెప్టెంబర్ 30 మార్చ్ను విజయవంతం చేయాలని శ్రీనివాస గౌడ్ కోరారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జెఎన్టియు విద్యార్థి నాయకులు తాళ్లపల్లి సురేందర్ గౌడ్, సునీల్, ఎం అనిల్ గౌడ్, రచయిత నవీన్, వెంకటేష్ గౌడ్, శ్రీధర్, అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.