అమెరికా దాడులు: అంధ్రా విద్యార్థులే ఎక్కువ
గత నాలుగేళ్లుగా భారత విద్యార్థులపై దాడుల సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల బోస్టన్లో కె. శేషాద్రి రావు అనే ఎంబిఎ విద్యార్థి హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని కుటుంబం ఒడిషాలో స్థిరపడినప్పటికీ, ఆంధ్రాకు చెందిందే. ప్రతి నాలుగు కుటుంబాల నుంచి ఒకరు అమెరికాలో ఉన్నట్లు చెబుతుంటారు. అది నిజమేనని చెప్పాల్సిన పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఐటి విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. చదువుల్లో టాప్గా వస్తున్నారు. దీంతో వారే ఎక్కువగా అమెరికాకు చదువులకు వెళ్లడం, ఐటి కంపెనీల్లో ఉద్యోగాలకు వెళ్లడం పరిపాటిగా మారిందని అభిప్రాయపడుతున్నారు. గత రెండు, మూడేళ్లలో పది మంది విద్యార్థులు లేదా ప్రొఫెషనల్స్ అమెరికాలో కాల్పుల్లో మరణించినట్లు సమాచారం. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం కుంభకోణంలో కూడా ఎక్కువ మంది తెలుగు విద్యార్థులే ఉండడాన్ని గమనించాం. అయితే, కొద్ది రోజులుగా అమెరికాలో భారత విద్యార్థులపై దాడులు తగ్గాయి. విశ్వవిద్యాలయాలకు విద్యార్థుల అవసరం ఉండడంతో ఆ దాడులు తగ్గినట్లు భావిస్తున్నారు. అయితే, ఇప్పుడు భారత విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు కెనడా వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.