వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమాయకత్వమూ ఉండాలి: జంపాల చౌదరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jampala Chowdary
డాల్లస్/ఫోర్టువర్త్, టెక్సస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 67వ సదస్సు ఆదివారం, ఫిబ్రవరి 17వ తేదీ రథ సప్తమి పర్వదినాన స్థానిక పసంద్ రెస్టారెంటులో 2013 సంవత్సరపు సాహిత్యవేదిక సమన్వయ కర్త శ్రీమతి సింగిరెడ్డి శారద అధ్యక్షతన జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 67 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం.

స్థానిక గాయని కుమారి కడిమిశెట్టి పూజిత ప్రార్ధనా గీతంతో సభ ప్రారంభమైంది. మొట్టమొదట, సమన్వయ కర్త శ్రీమతి సింగిరెడ్డి శారద 2013 సాహిత్యవేదిక సభ్యులయిన రొడ్డా రామకృష్ణా రెడ్డి, పున్నం సతీష్, బసాబత్తిన శ్రీనివాసులు, జంధ్యాల శ్రీనాధ్, ఆచంట సుబ్రహ్మణ్యం, ఆయులూరి బస్వి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం లను సభకు పరిచయం చేసారు.

సాహిత్య వేదిక మొదటి భాగం స్వీయ రచనా పఠనంతో అత్యంత ఆసక్తికరంగా ముగిసింది. నందివాడ ఉదయభాస్కర్ అమెరికా ఆర్ధిక వ్యవస్థను ఉటంకిస్తూ "యుగపురుషుడి పటిమ" కవిత చదివి సభను ఆలోచింపజేసారు. సాజీ గోపాల్ - ఇటీవల భారత ప్రభుత్వం అఫ్జల్ గురు అనే తీవ్రవాదిపై ఉరి శిక్ష అమలు జరిగిన సంఘటనపై స్పందిస్తూ "ఉరికొయ్య మీద ప్రజాస్వామ్యం" అన్న కవితను వినిపించారు. పొన్నం సతీష్ సభను ఉద్ద్దేశించి ప్రసంగిస్తూ రథ సప్తమి పండుగ గురించి సభకు వివరించారు. అలాగే సరస్వతీ పీఠం అయిన బాసర గురించి, కుంభమేళ విశిష్ఠ తను సభతో పంచుకున్నారు.

తరువాత ‘వాకిలి' అంతర్జాల పత్రికలో ప్రచురితమైన ప్రముఖ కవి వరవర రావు కవితను చదివారు. సాహిత్య వేదికకు సుపరిచితులైన తుమ్మూరి రామ్మోహన రావు పోతన పద్యం చదివారు. తెలుగు భాషపై ఉన్న మమకారంతో తమ స్వంత పనులు మానుకుని ఎంతో దూరం నుండి వచ్చిన సభికులను ఉద్దేశించి ఈరోజు రధ సప్తమి కాస్తా రస సప్తమిగా మారిందని చలోక్తులు విసిరారు.

తదుపరి సభికులకు స్వీయ కవిత అయిన "కొత్త కన్ను" చదివి వినిపించారు. తరువాత డా. జువ్వాడి రమణ, తెలంగాణపై ఆజాద్ చేసిన ఒకానొక ప్రకటనని గుర్తు చేస్తూ "అజాద్ స్వగతం" అన్న కవితా శీర్షికన "రేపంటే రేపూ కాదూ, మాపంటే మాపూ కాదు" అని పేరడీ పాట పాడి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు.

ప్రస్తుత టాంటెక్స్ కార్యదర్శి, సాహిత్య వేదిక సభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం నేటి కార్యక్రమ ముఖ్య అతిథి డా. జంపాల చౌదరిని పరిచయం చేస్తూ - గత ముప్పై రెండు ఏళ్ళుగా తెలుగు భాషకు, తెలుగు వారికి చేస్తున్న కృషిని గుర్తు చేసారు. తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవ కూడా ఎనలేనిదని, నిరంతర పాఠకుడిగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా తెలుగు బాషా సాహిత్యాలపై తమ మక్కువ చాటుకుంటున్నారని తెలిపారు. పోతన ఖతి అందరికి ఉచితముగా లభ్యం కావడం లోను, ఆంద్ర భారతి తెలుగు నిఘంటువులను అంతర్జాలంలో తీసుకురావడానికి కావలసిన నిధుల సమీకరణంలో కీలక పాత్ర వహించారని సభికులకు తెలిపారు. పుస్తకం.నెట్ లో చౌదరి ఇప్పటికి వంద పుస్తక సమీక్షలు పూర్తి చేసారని తెలుపుతూ, డా. జంపాల చౌదరిని వేదికమీదకు ఆహ్వానించగా, శ్రీ తుమ్మూరి రామ్మోహన రావు పుష్పగుచ్చంతో ప్రసంగకర్తకు స్వాగతం పలికారు.

"కథ, నేపథ్యం - సృజనాత్మకత" అనే అంశం మీద డా. జంపాల చౌదరి ప్రసంగం చేశారు. చిన్నప్పటి నుండి కథలపై తనకున్న ప్రేమను గుర్తు చేస్తుకుంటూ సృజనాత్మకత గురించి మాట్లాడారు. ఒక సంఘటన లేదా ఊహ, ఆలోచనలు పొదగడం వంటివి రచయిత సృజనాత్మకతని తెలియజేస్తుందన్నారు. కొన్ని సందర్భాలలో ఒక చిన్న సంఘటన ఆధారంగా అల్లుకున్న నవలలు, కథలున్నాయని చెప్పారు. రచయితకి ప్రపంచాన్ని తెలుసుకోవాలన్న ఆకాంక్షతో పాటూ అమాయకత్వం కూడా ఒక లక్షణం ఉండాలన్న విషయాన్ని గుర్తు చేసారు. మంచి రచనలు చేయాలంటే ఒక గురువు కానీ లేక పదివేల గంటల అభ్యాసం కానీ ఒక రచయితకి ఉండాలని చెప్పారు.

వల్లంపాటి వెంకట సుబ్బయ్య వ్రాసిన "కథా శిల్పం" పుస్తకం కథలో ఉండవలసిన శిల్పం ఆవశ్యకతను తెలియజేస్తుందని చెప్పారు. కథలెలా రాస్తారు అన్న అంశం మీద ఆర్.ఎం.ఉమా మహేశ్వర్ రావు ప్రచురించిన వ్యాసాలను ఒక చోట చేర్చి "కథా నేపథ్యం" పేరుతో తానా సంస్థ విజయవాడ ఎగ్జిబిషనులో ప్రధమ ప్రచురణ జరిగిందన్నారు. వచ్చే వేసవిలో జరిగే తానా సభల్లో రెండో ప్రచురణ ఆవిష్కరణ జరుగుతుందని చెప్పారు.

ఒక ప్రశ్నకు సమధాన మిస్తూ "తెలుగులో అంతర్జాల పత్రికల వల్ల ఉత్తర అమెరికాలో పెరుగుతున్న సృజనాత్మకతను తెలియజేసారు. ఈ పత్రికలు రచయితకు ప్రచురణ అవకాశాలను పెంచుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత తెలుగు కథలలో ఎక్కువగా మూస కథలు ఉంటున్నాయన్నారు. ఇంతకు ముందు కనిపించిన వైవిధ్యం ఇపుడు తెలుగు కథలలో కనిపించడం లేదన్నారు. కథ ఎలా ఉండాలి? ఎలా వ్రాయాలి? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ కథ చెప్పిన విధానం, ఇంకా భాష బాగుండాలన్నారు. శైలి కూడా బాగా ఉంటే ఇంకా మంచిది అని కూడా అన్నారు.

టాంటెక్స్ అధ్యక్షుడు మండువ సురేష్, పాలక మండలి అధిపతి డా. సి.ఆర్. రావు సంయుక్తంగా దుశ్శాలువతో ముఖ్య అతిథి డాక్టర్. జంపాల చౌదరి గారిని సన్మానించారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు సింగిరెడ్డి శారద, రొడ్డా రామకృష్ణా రెడ్డి, పున్నం సతీష్, బసాబత్తిన శ్రీనివాసులు, జంధ్యాల శ్రీనాధ్, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం సంయుక్తంగా ముఖ్య అతిధిని ఙ్ఞాపికతో సత్కరించారు. టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు కాకర్ల విజయ మోహన్, ఉపాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఉప్పలపాటి కృష్ణారెడ్డి ,కార్యవర్గ సభ్యులు శ్రీమతి వనం జ్యోతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
prominent writer Dr Jamapala Chowdary spoke on Telugu short story in Nela Nela Vennela programme of TANTEX.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X