ఇన్సైడర్ ట్రేడింగ్: తెలుగు టెక్కీకి 8నెలల గృహనిర్బంధం
న్యూయార్క్: స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణపై తెలుగు టెక్కీ బొంతు సుధాకర్ రెడ్డి (44)కి యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఎనిమిది నెలల గృహ నిర్బంధం శిక్షను విధించారు. 50 వేల డాలర్ల జరిమానా కూడా వేశారు.
అంతేగాక, సుధాకర్ రెడ్డి 75,979 డాలర్ల డిపాజిట్ను కూడా కోల్పోవలసి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజినీరు అయిన సుధాకర్ రెడ్డి జార్జియా రాష్ట్రంలో నివసిస్తున్నారు. 2003 సెప్టెంబరు నుంచి నుంచి 2018 మార్చివరకు ఈక్విఫాక్స్ కంపెనీలో పనిచేశారు.
తన దగ్గరకు వచ్చిన సమాచారాన్ని సమాచారం ఆధారంగా సొంతానికి షేర్లు కొనుగోలు చేసి, తక్కువ కాలంలోనే లబ్ధి పొందారు. ఆ మార్గంలో 75 వేల డాలర్లు సంపాదించారని, అంటే అతితక్కువ కాలంలో పెట్టుబడిపై 3,500 శాతం మేర లాభం పొందారని దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ ఆరోపించింది.
అనంతరం ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఈ వ్యవహారంలో చాలా మంది ఉన్నతాధికారులకు సంబంధం ఉన్నప్పుడు కేవలం తన భర్తకే ఎందుకు శిక్ష విధించారని ఆయన భార్య రేఖా వుమ్మిడి జడ్జిని ప్రశ్నించారు. ఈ కేసులో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.