ఎంజిఎంఎన్టిలో గాంధీకి ఘన నివాళి(ఫొటోలు)
డల్లాస్: భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి(జనవరి 30)ని పురస్కరించుకుని డల్లాస్ లోని ఇర్వింగ్ నగరంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో తెలుగు ప్రజలు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎంజిఎంఎన్టి) కార్యదర్శి రావు కల్వల మాట్లాడుతూ.. ఈ మెమోరియల్, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీకి చిహ్నాంగా మారిందన్నారు.
ఇది భారత స్వాతంత్ర్య కోసం గాంధీజీ పడిన శ్రమను తెలియజేస్తుందని.. శాంతి, అహింసా పద్ధతులను నేర్పుతుందని చెప్పారు. ఎంజిఎంఎన్టి ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. బ్రిటీష్ నియంతృత్వ పాలన నుంచి మహాత్మాగాంధీ భారతదేశానికి విముక్తి కల్పించారని గుర్తు చేశారు. సత్యం, అహింసా, ప్రేమ, దయ, గౌరవం, సమానత్వం లాంటి విలువలను గాంధీజీ బోధించారని చెప్పారు.
ఎంజిఎంఎన్టి కో ఛైర్మన్ తాయబ్ కుందవాలా మాట్లాడుతూ.. అహింసా మార్గంలో గాంధీజీ సాగించిన పోరాటమే భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టిందన్నారు. దేశం మొత్తం ఆయన వెనక నిలిచిందన్నారు.
ఎంజిఎంఎన్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శబ్నమ్ మోడ్గిల్ మాట్లాడుతూ.. పౌర హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా పోరాటం సాగించిన అనేక మంది నేతలకు మహాత్మాగాంధీ స్ఫూర్తి ప్రదాత నిలిచారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నేతలు డా. విశ్వనాథం పులిగండ్ల, గోపాల పిళ్లై, రాహుల్, జాన్ షెర్రీ, అలెక్స్ అలెక్జాండర్, అలేయుకుట్టి ఫ్రాన్సిస్, సత్యన్ కళ్యానదుర్గ్, తదితరులు పాల్గొని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.