లండన్: అనుమానాస్పద స్థితిలో ఎన్నారై ఫ్యామిలీ మృతి
లండన్: ఓ భారత సంతతి కుటుంబం తూర్పు లండన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భార్య, ఇద్దరు కవల పిల్లల మృతదేహాలను మంగళవారమే స్వాధీనం చేసుకున్న పోలీసులు, తూర్పులండన్లోని రిజర్వాయర్ వద్ద ఉరివేసుకున్న కుటుంబ యజమానిని గురువారం గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కేరళకు చెందిన రితీష్కుమార్ పుల్లార్కట్టిల్ (44), సింఘి రితీష్(37), వారి ఇద్దరు కవల పిల్లలు నివ్యా, నేహ (13) తూర్పులండన్లో కొన్నేళ్లుగా నివాసముంటున్నారు. కాగా, అనుమానాస్పదస్థితిలో ఇంట్లో చనిపోయిన సింఘి రితీష్, వారి ఇద్దరు కవల పిల్లలు నివ్యా, నేహ మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు.
కుటుంబ యజమాని రితీష్కుమార్ పుల్లార్కట్టిల్ కోసం గాలిస్తుండగా ఈశాన్య లండన్లోని రిజర్వార్ సమీపంలో గురువారం ఉరివేసుకుని కనిపించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, మృతుల బంధువుల ద్వారా వివరాలు తెలుసుకుంటున్నారు.
పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఎలా చనిపోయింది తెలుస్తుందని కేసు పరిశోధనాధికారి కెన్నీ మెక్డోనాల్డ్ చెప్పారు. అయితే వారి మృతికి ఆర్థిక సమస్యలా లేక కుటుంబ కలహాలు కారణమా అనేది తెలియరాలేదు.