భారత వ్యాపారవేత్తల కొంపలు కొల్లేరు
నైరోబి: తీవ్రవాదుల దాడులతో కెన్యా దేశ ప్రజలతోపాటు అక్కడి ప్రవాస భారతీయులు భయాందోళనలకు గురవుతున్నారు. తీవ్రవాదుల దాడులలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు భారీస్థాయిలో ఆస్తులు కోల్పోయారు. ఈ దాడులలో ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్తలు కూడా భారీగా నష్టపోయారు. కెన్యాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వ్యాపార వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తీవ్రవాదుల దాడిలో ఇప్పటివరకు 10మంది పౌరులు మరణించారని, వీరిలో ముగ్గురు భారతీయులున్నట్లు భారత డిప్యూటీ హై కమిషనర్ తన్మయలాల్ తెలిపారు. వెస్ట్గేట్ మాల్లో సోమవారం రాత్రి జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు మరణించినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను భారత విదేశీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వెబ్ సైట్లో ఉంచినట్లు లాల్ చెప్పారు.
కాగా మాల్లో కేఫ్లు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లతోపాటు సుమారు 80 దుకాణాలు ఉన్నాయి. ఇందులో 90శాతం వ్యాపారాలు భారతీయులవే కావడం గమనార్హం. మాల్లో ఎక్కువగా గిరాకీ ఉండే నకుమట్ సూపర్ మార్కెట్ ప్రవాస భారతీయుడైన షా కుటుంబానికి చెందినది. కాగా తీవ్రవాదుల దాడులలో వారి వ్యాపారాలు పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి. దాడిలో తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని వ్యాపార వేత్తలుఆవేదన వ్యక్తం చేశారు.
ప్రవాస భారతీయులకు సంబంధించిన బ్యాంక్ ఆఫ్ బరోడా, పారమౌంట్ బ్యాంకులలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. తూర్పు అఫ్రికాలోనే పెద్ద వ్యాపార సంస్థ బిడ్కో ఆయిల్ రిఫైనరీ యజమాని, ప్రవాస భారతీయుడు విమల్ షా తమ కంపెనీలోని సీనియర్ ఉద్యోగి ముతుల్ అమృత్లాల్ షాను కోల్పోయారు. టీవీ వ్యాఖ్యాత లలిత్ కుమార్ సోలంకి, బెంగళూరుకు చెందిన పుస్తకాల వ్యాపారి బి. సుదర్శన్ నాగరాజ్ కూడా దాడిలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఇస్లామిస్ట్ అలీ షబాబ్ తీవ్రవాదాలు చేసిన దాడులలో మరో ఇద్దరు ప్రవాస భారతీయుల మృత దేహాలను గుర్తించినట్లు లాల్ తెలిపారు. తమిళనాడుకు చెందిన శ్రీధర్ నటరాజన్, బ్యాంక్ ఆఫ్ బరోడా నైరోబి బ్రాంచ్ మేనేజర్ కుమారుడు పరామ్షు జైన్ మృతి చెందినట్లు చెప్పారు. కాగా తీవ్రవాదుల కాల్పుల్లో 11మంది సైనికులకు తీవ్రగాయాలయ్యాయని, సైనికులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.