లంచం తీసుకున్న ఎన్నారై డాక్టర్ అరెస్ట్
న్యూయార్క్: అమెరికాలోని ఓ ప్రముఖ వైద్యశాలలో వైద్యుడిగా కొనసాగుతున్న భారత సంతతికి చెందిన వ్యక్తి ముడుపులు(లంచం) తీసుకున్న కేసులో దోషిగా తేలాడు. అతడు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను తారుమారు చేసేందుకు లంచం తీసుకున్నట్లు పోలీసులు తమ విచారణలో తేల్చారు.
న్యూయార్క్లోని బ్రూక్లైన్ నివాసముంటున్న పిడియాట్రిషియన్ సురేందర్ గోరుకంటి(46)ని అరెస్ట్ చేసిన పోలీసులు న్యూయార్క్ జిల్లా ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టారు. సురేందర్ లంచం తీసుకున్నట్లు అతనిపై అభియోగాలు మోపడం జరిగిందని అటార్నీ పాల్ ఫిషర్మన్ తెలిపారు.
ఈ లంచం తీసుకున్న కేసులో 24మంది ప్రజలతోపాటు 14మంది ఫిజిషియన్స్కి సంబంధం ఉందని ఆయన తెలిపారు. వీరందరూ కలిసి 100 మిలియన్ డాలర్లకు పైగా లంచం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ కేసులో పలు ప్రైవేటు ఇన్య్సూరెన్స్ కంపెనీలకు, డయాగ్నిస్టిక్ కంపెనీకి కూడా సంబంధం ఉందని అటర్నీ వివరించారు.
గోరుకంటి సురేందర్ దోషిగా తేలడంతో అతనికి సుమారు ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని, 2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని అటర్నీ తెలిపారు. అతని శిక్షను జూన్ 16న కోర్టు ఖరారు చేయనుందని ఆయన చెప్పారు. నిందితుడు గోరుకంటి ఈ కేసులో 14వేల డాలర్ల లంచం తీసుకున్నట్లు అంగీకరించాడని పాల్ చెప్పారు. కేసు విచారణలో 7 మిలియన్ డాలర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు.