ఎంజిఎంఎన్టిలో అమెరికా స్వాతంత్ర్య వేడుక(ఫొటోలు)
డల్లాస్: అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాన్ని(జులై 4) పురస్కరించుకుని ఇర్వింగ్ నగరం థామస్ జాఫర్సన్ పార్క్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజిఎంఎన్టి)లో బ్రిటన్ అమెరికాకు స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన థామస్ జాఫర్సన్ తోపాటు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తోపాటు పలువురు ప్రవాసులు నివాళులర్పించారు. థామస్ జాఫర్సన్ అమెరికాకు మూడవ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.
ఈ సందర్భంగా డా. యార్లగడ్డ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంజిఎంఎన్టి ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర, ఆయన బృందాన్ని అభినందించారు. ఈ మెమోరియల్ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని, గాంధీ బాటలో నడిచేందుకు దోహదపడుతుందన్నారు. గాంధీ చూపిన మార్గం ప్రపంచానికి ఒక శాంతి సందేశమని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పార్లమెంటులో మాట్లాడుతూ.. గాంధీ వ్యాఖ్యలు తననెంతో ప్రభావితం చేశాయని చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాసిన'దక్షిణాఫ్రికాలో మహాత్మోదయం' అనే పుస్తకాన్ని డా. ప్రసాద్ తోటకూర ఆవిష్కరించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికన్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా విప్లవంలో ప్రాణాలొదిలిన 4,500మందికి నివాళుర్పించారు.వీరందరి త్యాగాలు, పోరాటంతో చివరకు 1776, జులై 4న అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంజిఎన్టి కార్యదర్శి రావు కల్వల, ఎంజిఎన్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శబ్నమ్ మోద్గిల్, డా. సీఆర్ రావు, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, ఎంవిఎల్ ప్రసాద్, డా. శ్రీనివాస్ రెడ్డి ఆళ్ల, రామ్ తాతినేని, డా. సుబ్బారావు పొన్నూరు, వెంకట అనిల్ పొత్తూరు, శ్రీధర్ తుమ్మల, డా. ఉమామహేశ్వర రెడ్డి, కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.