అమెరికా సాహితీసభలో కాత్యాయని
డాల్లస్/ఫోర్టువర్త్, టెక్సస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 78 వ సదస్సు ఆదివారం, జనవరి 19వ తేది స్థానిక నందిని రెస్టారెంటులో సాహిత్యవేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడినది. ప్రవాసంలో నిరాటంకంగా 78 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డాల్లస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేశారు.
స్థానిక చిన్నారి కొమ్మెర పూజిత ప్రార్థనా గీతంతో సభను ప్రారంభించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద తమ స్వాగాతోపన్యాసంలో ప్రతి నెలాజరపుకొనే "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమానికి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలతో అందరికీ స్వాగతం తెలిపారు.
సాహిత్య వేదిక ముఖ్య అతిథి డా. కేతవరపు కాత్యాయని విద్మహేను, ప్రసిద్ద స్త్రీ వాద రచయిత్రి, దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తన రచనా వ్యాసంగం ద్వారా స్త్రీ జనాభ్యుదయానికి కృషి చేస్తూ ఎన్నో పురస్కారాలను అందుకుని ఈ మధ్యనే కేంద్ర సాహిత్య అకాడమి అవార్డుకు ఎంపికయిన ఉత్తమ రచయిత్రి. ఈ అలుపెరుగని నిత్య సాహితీ వేత్తను గౌరవించడం సాహిత్య సేవకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం "నెల నెలా తెలుగు వెన్నెల" చరిత్రలో ఒక మైలు రాయి అని సింగిరెడ్డి శారద కొనియాడుతూ కేతవరపు కాత్యాయని విద్మహేని వేదికపై ఆహ్వానించగా, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం పూర్వాధ్యక్షుడు తోటకూర ప్రసాద్ గారు పుష్పగుచ్చంతో ప్రసంగకర్తకు స్వాగతం పలికారు.

డా. కేతవరపు కాత్యాయని విద్మహే తన ప్రసంగంలో సాహిత్య దృక్పథంలో ప్రజాస్వామిక విలువల గురించి విశ్లేషిస్తూ, సాహిత్యాన్ని సాహిత్యం కోసం చదవటం కాకుండా, చదివిన సాహిత్యాన్ని మానవీయ కోణం నుంచి అవగాహన చేసుకోవటం నేడు అత్యంత అవసరమని అన్నారు. ప్రాచీన సాహిత్యంలో స్త్రీ వాద అభ్యుదయ వాదాన్ని పురాణాలు, ఇతిహాసాల నుండి సోదాహరణంగా సభతో పంచుకున్నారు. మానవ జీవన సంబంధాలను విశ్లేషించి అవి సాహిత్య రూపాలలో ఎలా పరిణతి చెందాయో వివరించారు. తరతరాల సాహితీ సంపద నుండి వెలుగులోకి వచ్చిన అనేక భావాలను డా. కేతవరపు కాత్యాయని విద్మహే సభకు పరిచయం చేసారు.
ముఖ్య అతిథిని ప్రసంగానంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కాకర్ల విజయమోహన్, ఉత్తరాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి ముఖ్య అతిథిని శాలువతో సంయుక్తంగా సత్కరించారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు సింగిరెడ్డి శారద, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, రొడ్డ రామకృష్ణ రెడ్డి, పున్నం సతీష్, ఆయులూరి బస్వి, ఆదిభట్ల మహేష్ ఆదిత్య, అట్లూరి స్వర్ణ, నిమ్మగడ్డ రామకృష్ణ సంయుక్తంగా డా. కేతవరపు కాత్యాయని విద్మహేను జ్ఞాపికతో సత్కరించారు.2014 సంవత్సరానికి తెలుగు సాహిత్యవేదిక నూతన సమన్వయ కర్తగా బాధ్యతలు స్వీకరించిన ఆదిభట్ల మహేష్ ఆదిత్య సింగిరెడ్డి శారద సభకు పరిచయం చేసారు.
టాంటెక్స్ సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యుడు ఆయులూరి బస్వి, "మాసానికో మహనీయుడు" శీర్షిక లో భాగంగా నాలుగు వందలకు పైగా సినిమాలలో నటించి 86 సంవత్సరాలపాటు సినీ కళామ తల్లికి ఎనలేని సేవలందించి, ఇటీవలే స్వర్గస్తులైన డా.అంజలీ దేవి గారి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు అని గుర్తు చేశారు. ఒక దేవత ఎలా ఉండాలని అందరూ ఊహించుకుంటారో, ఆ ఊహలన్నిటికీ ప్రతిరూపంగా అంజలి దేవి గారి రూపం, నటన, గళం ఉంటాయని కొనియాడారు. వేదికపై విచ్చేసిన సాహితీప్రియులందరూ ఒక నిమిషం మౌనం పాటించి డా.అంజలీ దేవి మృతికి సంతాపాన్ని ప్రకటించారు.
వెండితెరకి బాలనటిగా పరిచయం అయి, చిన్న వయసులోనే క్లిష్టమైన పాత్రలను పోషించి, అత్యంత సహజ నటనతో అందరి అభిమానాలను అందుకొని, ఎందరో కథానాయికలకు గాత్రదానం చేసి, తెలుగు సినీ ప్రపంచం గర్వించ దగ్గ విశిష్ట నటీమణి శ్రీమతి రోజా రమణిని ఆదిభట్ల మహేష్ ఆదిత్య వేదికపైకి ఆహ్వానించగా స్థానిక సాహిత్యాభిమాని డా.రతిరెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
శ్రీమతి రోజారమణి భక్త ప్రహ్లాదలో తమకు వచ్చిన అవకాశం గురించి, తమ సినీ నటజీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ఆనందం నింపిన సంఘటనలు, తమకు రాష్ట్రపతి ద్వారా అందిన అభినందనలు, తదితర అంశాలతో సభను ఆహ్లాద పరిచారు. స్థానిక గాయకుడు కుందేటి చక్రపాణి, టాంటెక్స్ పాలకమండలి పూర్వాధిపతి డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి రోజారమణి గారిపై చిత్రీకరించిన మధురమైన సినిమా గీతాలను తమ అధ్భుత గాత్రంతో ఆలపించి సభను అలరించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కాకర్ల విజయమోహన్, పాలక మండలి సభ్యుడు డా. సి.ఆర్.రావు శ్రీమతి రోజా రమణి గారిని శాలువతో సంయుక్తంగా సత్కరించారు.
భాషా సాహిత్యాలకు పెద్దపీట వేస్తున్న సాహిత్య వేదిక కార్యవర్గాన్ని అభినందిస్తూ, 2014 సంవత్సరంలో సేవలందించడానికి ఆసక్తి ఉన్న స్వచ్చంద సేవకులను సింగిరెడ్డి శారద ఆహ్వానించారు. టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షుడు మండువ సురేష్, కార్యవర్గ సభ్యులు వీర్నపు చినసత్యం, ఉప్పలపాటి కృష్ణారెడ్డి, శీలం కృష్ణవేణి, వనం జ్యోతి ఈ కార్యక్రంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications