అనుమానాస్పద స్థితిలో భారతీయ దంపతుల మృతి
టెక్సాస్: అమెరికాలో ఇటీవలి భారతీయ దంపతుల మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్ాయి. కుమారుడు మరణించిన విషాదం నుంచి తేరుకోకముందే భార్యాభర్తలు మృత్యువాత పడ్డారు. వీరి మరణానికి కారణాలు ఏమిటనేది స్పష్టం కావడం లేదు. ఈ సంఘటన టెక్సాస్లోని ఫ్రిస్కోలో జరిగింది.
సుమీత్ ధావన్ (43), పల్లవి (30) దంపతులకు అర్నవ్ అనే పదేళ్ల కుమారుడు ఉండేవాడు. అనారోగ్య సమస్యలతో బాధపడే అర్నవ్ను ఎల్లవేళలా కనిపెట్టుకుని చూడాల్సి వచ్చేది. ఈ ఏడాది జనవరిలో అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్నానాల గదిలో బాత్ టబ్లో ఐస్ గడ్డలతో కప్పి ఉన్న అతని మృతదేహం బయపడింది.
అర్నవ్ అనారోగ్యం కారణంగానే చనిపోయాడని, విదేశాలకు వెళ్లిన సుమీత్ తిరిగి వచ్చే వరకు ఉంచాలనే ఉద్దేశంతో శవాన్ని ఐస్లో పెట్టామని పల్లవి చెప్పింది. హిందూ ధర్మం ప్రకారం కర్మకాండలు జరిపించాలనే ఉద్దేశంతో తాను ఈ పని చేసినట్లు ఆమె చెప్పింది.
టెక్సాస్లో ఉంటున్న సుమీత్ తోబుట్టువులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనే ప్రశ్నకు ఆమె వద్ద సమాధానం లేదు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. అర్నవ్ను హత్య చేశారా అనే ప్రశ్నకు పల్లవి అవుననే పద్ధతిలో తలూపినట్లు పోలీసులు చెప్పారు.
తమ ఒక్కగానొక్క కుమారుడిని ఒక్క దెబ్బ కూడా వేయని పల్లవి హత్య చేసిందంటే నమ్మశక్యంగా లేదని సుమీత్ అన్నాడు. ఈ కేసు విచారణ సాగుతుండగానే సుమీత్, పల్లవి తమ నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. స్విమ్మింగ్ పూల్లో పల్లవి శవమై తేలగా, సుమీత్ తలపై గాయంతో తన గదిలో విగతజీవుడై కనిపించాడు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా, మరేదైనా కారణం ఉందా అనేది తేలడం లేదు. వారి నివాసంలో ఓ నోట్ దొరికింది. ఆ నోట్లో ఏముందో చెప్పడానికి పోలీసులు నిరాకరించారు.