ఎన్నారైలకు మోడీ మార్గనిర్దేశం
వాషింగ్టన్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ 2014 సార్వత్రిక ఎన్నికలకు ప్రవాస భారతీయుల మద్దతు పెంచుకునేందుకు సన్నాహక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా టంపాలో బీజేపీ మద్దతుదారులైన ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో జరగనున్న వార్షిక సమావేశంలో నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని వినిపించనున్నారు.
భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు అమెరికాలోని పార్టీ మద్దతుదారుల సంఘం ‘ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ' సభ్యులు తెలిపారు. సెప్టెంబర్ 21న టంపా పట్టణంలో జరగనున్న సమావేశంలో ఆన్లైన్ ద్వారా నరేంద్ర మోడీ దిశా నిర్దేశం చేస్తారని వారు తెలిపారు. సమావేశానికి సంఘం సభ్యులతోపాటు అమెరికాలోని భారతీయులందరూ హాజరవుతారని చెప్పారు.
బీజేపీకి మద్దతు పెంచేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు సంఘ సభ్యుడు చంద్రకాంత్ పటేల్ తెలిపారు. 'మిషన్ 2014:బీజేపీ 272ప్లస్' నేపథ్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశం సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుందని, కార్యక్రమాన్ని బీజేపీ ఉపాధ్యక్షులు స్మృతి ఇరానీ ప్రారంభిస్తారని చంద్రకాంత్ తెలిపారు.
ఇది ఇలా ఉండగా 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిని ప్రకటించేందుకు భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అగ్రనేతలు కసరత్తులు తుది స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించేందుకు పార్టీలోని నేతలందరూ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా త్వరలోనే ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.