విభజన అనివార్యమైతే: అమెరికాలో చర్చ
వాషింగ్టన్: రాష్ట్ర విభజనపై ప్రవాసాంధ్రులతో పీపుల్ ఫర్ లోక్ సత్తా(పిఎఫ్ఎల్) కాలిఫోర్నియాలోని సన్నీవేల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తెలంగాణ, కోస్తా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సమావేశంలో రాష్ట్ర విభజన అనివార్యం అయితే అనే అంశంపై చర్చించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఎన్నారైలు రాష్ట్ర విభజనపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కళ్యాణ్ రమణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు, హైదరాబాద్లో ఉంటున్న ఇతర ప్రాంతాల ఉద్యోగులకు, వారి ఆస్తులకు రక్షణ, విద్యా సంస్థలు, విద్యుత్, సహజ వనరుల పంపిణీ ఎలా ఉంటుందనే విషయాలపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్ర విభజనతో రాబోయే కాలంలో వచ్చే సమస్యలపై ఎన్నారైలు నిర్వహించాల్సిన పాత్ర ఏమిటనేదానిపై వారు చర్చించారు.

రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంతాల నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నీటి పంపిణీ, ఉద్యోగాలు మొదలగు సమస్యలను నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా పరిష్కరించుకోవచ్చని, కొంతమంది పక్షపాత వైఖరిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కొందరు ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. విభజనతో వచ్చే సమస్యలను ఇరు ప్రాంతాల వారు చర్చించుకుని పరిష్కరించుకోవాలని, అవకాశవాదులతో సమస్యలు రాకుండా చూడాలని మరికొందరు ఎన్నారైలు పేర్కొన్నారు.
మనం అందరం భారతీయులం కాబట్టి రాష్ట్ర విభజన జరిగినా.. జరగకపోయినా తెలుగు వారందరూ ఐక్యంగా ఉండాలని సమావేశంలో పాల్గొన్న ఎన్నారైలందరూ అభిప్రాయపడ్డారు. విభజనపై మూడు ప్రాంతాల ఎన్నారైలను ఒక వేదికపైకి చేర్చి సమావేశ పర్చిన పిఎఫ్ఎల్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశానికి హాజరైన ప్రవాసాంధ్రులందరికీ పిఎఫ్ఎల్ బే ఏరియా అధ్యక్షుడు రవీంద్ర నందం ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications