నర్సాపురంలో గోదావరి తీరాన బాపు ప్రతిమ: తానా
తానాతో బాపుకు ఉన్న అనుబంధం మరచిపోలేనిదని తానా అధ్యక్షుడు మోహన్నన్నపనేని అన్నారు. ఆయనను గౌరవించుకోవడం, గుర్తుంచుకోవడం మన కర్తవ్యమన్నారు. అమెరికా తెలుగు సమాజంతో, ముఖ్యంగా తానాతో బాపుకు ఉన్న అనుబంధం మరవలేనిదని తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు డా. జంపాల చౌదరి అన్నారు. 1985లో లాస్ఏంజెలిస్లో తానా నిర్వహించిన మహాసభల్లో ప్రత్యేక అతిధిగా బాపు పాల్గొన్నారని, అప్పుడు ఆయన బొమ్మల ప్రదర్శన అందరినీ ఎంతో ఆకట్టుకున్నదని అన్నారు.
బాపు-రమణల మొదటి ప్రచురణల స్వర్ణోత్సవాన్ని మొదటగా జరిపింది కూడా తానాయేనని గుర్తుచేశారు. 1995లో చికాగోలో జరిగిన దశమ తానా మహాసభలలో జరుపుకున్న ఈ సంబరాలకు హాజరైన బాపుతో ముఖాముఖీ ఆయన అభిమానులను ఎంతగానో ఆనందపరిచిందని తెలిపారు. ఈ సందర్భంగా బాపు-రమణల చలనచిత్ర ప్రదర్శన, బాపు చిత్రకళా ప్రదర్శన నిర్వహించటమే కాక, బాపు-రమణల అనుబంధానికి గుర్తుగా బొమ్మా-బొరుసూ అనే పుస్తకం ప్రత్యేకంగా ప్రచురించిన విషయాన్ని డా. జంపాల చౌదరి గుర్తు చేశారు.
తానా పత్రికకు, తానా సావనీర్లకు బాపు ఎన్నో బొమ్మలను గీసి ఇచ్చారని తెలిపారు. అలా అమెరికా తెలుగువారితో, తానాతో ఆయన అనుబంధాన్ని పెంచుకున్నారని జంపాల చౌదరి అన్నారు. అమెరికాలోని తెలుగువారితో బాపుకు ఉన్న అనుబంధానికి గుర్తుగా బాపు విగ్రహాన్ని ఆయన పుట్టిన ఊరైన పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో తానా ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యక్షుడు మోహన్నన్నపనేని, కార్యదర్శి సతీష్వేమన తెలిపారు.
బాపు పుట్టినరోజైన డిసెంబర్15వ తేదీన ఈ ప్రతిమను ఆవిష్కరించనున్నట్లు వారు చెప్పారు. డిసెంబర్లో భారత్లో తానా నిర్వహించే చైతన్యస్రవంతి వేడుకల్లో బాపు బొమ్మల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు మోహన్ నన్నపనేని పేర్కొన్నారు. డిట్రాయిట్లో జూలైలో జరిగే తానా మహాసభల్లో కూడా బాపు బొమ్మల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నామని, తానాతో బాపుకు ఉన్న అనుబంధాన్ని తెలిపేలా ఈ ప్రదర్శన ఉంటుందని మోహన్తెలిపారు.