తానా ఎన్నికలపై ఉత్కంఠ: పోటీలో ఇద్దరు
హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలు శాసనసభ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇరువురు అభ్యర్థుల మధ్య ఆసక్తికరమైన పోటీ జరుగుతోంది. అధ్యక్ష పదవికి సతీష్ వేమన, రామ్ యలమంచిలి పోటీ పడుతున్నారు.
దాదాపు 20 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేపు, ఎల్లుండి ఓటర్లు తమ పోస్టల్ బ్యాలెట్ల ద్వారా అమెరికాలోని తెలుగు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఫలితాలు ఈ నెల 25వ తేదీన బోస్టన్లో వెలువడుతాయి. మార్చి 30వ తేదీన బ్యాలెట్ పేపర్లను పంపిణీ చేశారు.
కాగా, సతీష్ వేమన గత 15 ఏళ్లుగా తానాలో ఉన్నారు. ఇది ఆయన ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. రామ్ యలమంచిలి రెండు సార్లు తానాకు రాజీనామా చేసి, తిరిగి వచ్చారు. ఇది ఆయన మైనస్ పాయింట్ కావచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఓటింగ్ జరిగి ఫలితాలు వెలువడే వరకు విజయం ఎవరిదనేది ఉత్కంఠగానే ఉండిపోతుంది.
అమెరికా తెలుగు ప్రజల్లో అత్యంత ఆదరణ పొందిన సంఘాల్లో తానా ఒకటి. మరో సంస్థ ఆటా. ఈ రెండు సంస్థలు కూడా తెలుగు ప్రజల పరిస్థితిని పట్టించుకుంటూ విశేషమైన సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలపై తెలుగు ప్రజల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొని ఉంది. ఎన్నికైన రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు. అంటే, 2017వరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.