పాక్ను నిలదీసిన రాజ్నాథ్: ఎత్తుకు పైయెత్తు
ఇస్లామాబాద్: ఉగ్రవాదం పట్ల పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిని భారత్ హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ నిలదీశారు. ఒక దేశం ఉగ్రవాది మరో దేశం అమరవీరుడు కాలేడని ఆయన పాకిస్తాన్ తీరును దుయ్యబట్టారు. సార్క్ సదస్సు వేదికగా ఆయన ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. బుర్హాన్ వనీని పాకిస్తాన్ అమరవీరుడిగా అభివర్ణించడంపై ఆయన మండిపడ్డారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం ఉండదన్నారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వ్యక్తులు, సంస్థలు, దేశాలపై కఠినచర్యలు తీసుకోవాల్సిందేనని రాజ్నాథ్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను వీరులుగా కీర్తించడం తగదని పాకిస్థాన్ నాయకత్వానికి నేరుగా చురకలంటించారు. ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు అవసరమని ఆయన అన్నారు.
పాక్ లో రాజ్ నాథ్ సింగ్: మాలిక్ భార్య నిరాహారదీక్ష
అయితే, రాజ్నాథ్ సింగ్ ప్రసంగాన్ని పాకిస్తాన్ అడ్డుకుంది. పాకిస్తాన్ టీవీని మాత్రమే అనుమతించిన పాక్ అధికారులు కేవలం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ హోం మంత్రి సందేశాలను మాత్రమే ప్రసారం అయ్యేలా చేశారు. రాజ్నాథ్ ప్రసంగం వార్తను సేకరించకుండా భారత మీడియాను, అంతర్జాతీయ మీడియానూ పాకిస్తాన్ అడ్డుకుంది. దీనిపై ఇండియన్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశాయి. అయినా నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఇదిలావుంటే, పాకిస్థాన్ ఇస్లామాబాద్లో జరిగిన సార్క్ హోం మంత్రుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను పాకిస్తాన్ విందుకు పిలిచి అవమానించాలని అనుకున్నట్లు అర్థమవుతోంది. ఈ విందును పాక్ హోం మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ ఏర్పాటు చేశారు. సార్క్ సదస్సులో ప్రధాన కార్యక్రమం ముగిసిన వెంటనే రాజ్నాథ్కు విందు ఇవ్వాలని అనుకున్నారు.
అయితే సదస్సు ముగిసిన వెనటే విందు సమావేశం నుంచి పాక్ హోం మంత్రి కనిపించకుండా వెళ్లిపోయారు. ఈ విషయం రాజ్నాథ్కు తెలుసో లేదో కానీ ఆయన కూడా విందుకు వెళ్లలేదు. పిలిచి అవమానించాలనుకున్న పాక్ హోం మంత్రి ఎత్తుకు రాజ్నాథ్ పైఎత్తు వేశారని అంటున్నారు. విందుకు వెళ్లకుండా తాను బసచేసిన హోటల్లోనే భోజనం చేసి భారత్కు తిరిగి పయనమయ్యారు.
పాకిస్తాన్లో నిరసనలు
రాజ్నాథ్సింగ్ పర్యటన సందర్భంగా పాకిస్తాన్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు యాసిన్ మాలిక్ భార్య హుస్సేన్ మాలిక్ కరాచీలో 12 గంటల నిరాహారదీక్షకు దిగారు. ఇస్లామాబాద్లో లష్కర్ నేత హఫీజ్ సయీద్ అనుచరులు భారీ ర్యాలీ తీశారు. భారతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అజాద్ కాశ్మీర్ కోసం ప్రాణాలు అర్పిస్తామని అన్నారు. భారత జెండాను దగ్ధం చేశారు. మోడీ, రాజ్నాథ్ బొమ్మలను చెప్పులతో కొట్టారు.