రైతుల పోరాటానికి మద్దతుగా మావోయిస్ట్ ల లేఖ .. మోడీ వల్లే వ్యవసాయ రంగ సంక్షోభమన్న మావోలు
దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దులలో రైతుల పోరాటం కొనసాగుతోంది. దిక్కులు పిక్కటిల్లేలా మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో తీవ్రంగా ఉన్న చలి ఆందోళన చేస్తున్న రైతుల ప్రాణాలు తీస్తున్నప్పటికీ రైతులు మాత్రం ఆందోళన చేస్తూనే ఉన్నారు. తమ ప్రాణాలు పోయినా సరే వ్యవసాయ చట్టాల రద్దు చేస్తేనే తిరిగి వెళతామని తేల్చి చెబుతున్నారు.

రైతులకు మద్దతుగా ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖ
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు చేస్తున్న ఆందోళనకు మావోయిస్టులు తమ మద్దతును ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ సిపిఐ మావోయిస్టు పార్టీ ఆంధ్రా, ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ లేఖను విడుదల చేసింది. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో విడుదల చేసిన లేఖలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ దేశంలో ఎన్నడూ జరగని తీవ్రమైన వ్యవసాయ రంగ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆరోపించారు.

మోడీ 10 సూత్రాల కార్యక్రమం బూటకం
గత ఏడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేసిన హరిత విప్లవ భావన మరియు ప్రపంచీకరణ విధానాలు దేశంలోని రైతులకు ఎలాంటి భద్రత కల్పించలేదని మావోయిస్టులు ఆరోపించారు.
మోడీ 10 సూత్రాల కార్యక్రమం బూటకమని ఆరోపించారు .మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు రైతులను కాంట్రాక్ట్ వ్యవసాయం వైపు నెట్టివేస్తున్నాయని అన్నారు, ఇది కార్పొరేట్ పెద్దలకు మాత్రమే ప్రయోజనాలను చేకూరుస్తుండటంతో దేశంలోని వ్యవసాయ రంగానికి ఇది పెద్ద ముప్పుగా మారుతుందని మావోయిస్టులు ఆరోపించారు.

ఉద్యమంలో భాగంగా మరణించిన 40 మంది రైతులకు మావోయిస్టుల పార్టీ నివాళులు
ప్రాణాలను అర్పించిన 40 మంది రైతులకు మావోయిస్టుల పార్టీ నివాళులు అర్పిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు. రుణ మాఫీ, కనీస మద్దతు ధర (ఎంఎస్పి) మరియు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు కూడా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వదు అని ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ అన్నారు. తమకు ప్రయోజనాలు లభించే కొత్త విప్లవాత్మక వ్యవస్థ కోసం రైతులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన అన్నారు.

తీవ్రమైన చలిలో 38వ రోజు రైతుల ఆందోళన
వ్యవసాయ విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయడమే రైతాంగ సమస్యలు ఏకైక పరిష్కార మార్గమని లేఖలో పేర్కొన్నారు. ఇక 38వ రోజు ఢిల్లీలో వ్యవసాయ చట్టాల రద్దుకు రైతన్నల పోరాటం కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దు వద్ద మోహరించిన రైతులు ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నారు.












Click it and Unblock the Notifications