రథ సప్తమి విశిష్ఠత ఏమిటీ?..ఆదిత్య హృదయాన్ని ఎందుకు పఠించాలి?
సమస్త లోకానికి మూలాధారం సూర్యభగవానుడు. సూర్యుడు లేని ఈ జగత్తును అస్సలు ఊహించలేం. విశ్వం ఆయన చుట్టూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. హిందూ సంప్రదాయంలో అత్యున్నతమైనదిగా చెప్పుకొనే పంచాగానికి ఆద్యుడు. సూర్యుడి చుట్టూ భూపరిభ్రమణం ఆధారంగానే రోజులు, వారాలు, తిథులు ఏర్పడ్డాయి. అందుకే సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా కొలుస్తుంటాం. సమస్త జగత్తులో చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదిస్తాడు సూర్యుడు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలే జ్ఞానపూర్ణుడిగా పూజిస్తుంటాం.
సూర్యజయంతిగా..
సూర్యుడిని పూజించడానికీ ఓ రోజు ఉంది. అదే రథ సప్తమి. ఈ సంవత్సరం రథ సప్తమి ఫిబ్రవరి 7వ తేదీన అంటే సోమవారం జరుపుకోవాల్సి ఉంది. హిందూ పంచాంగం ప్రకారం- ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షం ఏడవ రోజును రథ సప్తమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగను అచల సప్తమి, సూర్య జయంతిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు మాఘ శుక్ల పక్షమి రోజునే జన్మించాడు. ఇదే రోజున సప్తాశ్వరూఢుడై భక్తకోటికి దర్శనమిచ్చాడు.
సుముహూర్తం ఇదే..
ఎంతో విశిష్టత కలిగిన ఈ పవిత్రమైన రోజున సూర్య భగవానుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఎలాంటి అనారోగ్య ఛాయలు దరిచేరవని భక్తులు విశ్వసిస్తారు. రథ సప్తమి నాడు తెల్లవారుజామున 5:22 నిమిషాల నుంచి ఉదయం 7:06 నిమిషాల మధ్య సూర్యుడిని పూజించడానికి మంచి ముహూర్తమని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజున నదీస్నానానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. నదిలో స్నానం చేసి, సూర్యునికి ఆర్ఘ్యాన్ని సమర్పించారు. సూర్య మంత్రాలను జపించాలి. ఆదిత్య హృదయాన్ని పఠించాలి.
ఎర్రని పూలతో పూజలు..
రథ సప్తమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.. తలస్నానం చేయాలి. జిల్లేడు ఆకులను వేసిన నీటిలో స్నానం చేయడం ఉత్తమమని పండితులు చెబుతుంటారు. అనంతరం సూర్యరశ్మి పడే చోట కొంత భాగాన్ని ఎర్రమట్టితో పూయాలి. దానిపై రథం ముగ్గును వేయాలి. దానికి గంధం, కుంకుమ పెట్టి, ఎర్రని పువ్వులతో అలంకరించాలి. బియ్యంతో చేసిన పొంగళిని నైవేద్యంగా సమర్పించి, పూజలు చేయాలి. తులసీ చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి.
అపజయాన్ని దరి చేరనివ్వని ఆదిత్య హృదయం..
ఆదిత్య హృదయాన్ని పఠించాలి. వ్యాస మహర్షి విరచితం ఇది. శ్రీరామచంద్రుడు సైతం రావణాసురుడితో యుద్ధం చేయడానికి ముందు ఆదిత్య హృదయాన్ని పఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆదిత్య హృదయాన్ని రోజూ పఠించడం వల్ల అపజయం ఉండదని పెద్దలు చెబుతుంటారు. ఒడిశాలోని కోణార్క్, ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య భగవానుడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమల శ్రీవారి సన్నిధిలోనూ రథ సప్తమి పండగను వైభవంగా నిర్వహిస్తారు.
తిరుమలలో..
రథ సప్తమి నాడు శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. తెల్లవారు జామున సూర్యప్రభ వాహనంపై అర్చకులు స్వామివారిని ఊరేగిస్తారు. అనంతరం చిన్నశేష వాహనం, ఆ తరువాత గరుడ వాహన సేవ ఉంటాయి. మధ్యాహ్నం నుంచి హనుమంత వాహన సేవ, నిర్వహిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు. సాయంత్రం కల్పవృక్షంపై భక్తులకు ఆ శ్రీనివాసుడు దర్శనం ఇస్తాడు. సర్వభూపాల వాహనం, రాత్రి చంద్రప్రభపై శ్రీవారు ఊరేగుతారు. చంద్రప్రభ వాహనం ఉరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి.