వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిసీల నాలుగో కన్ను

By బాణాల శ్రీనివాసరావు
|
Google Oneindia TeluguNews

దళిత కవిత్వంలోను, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదం కవిత్వంలోను, బీసివాద కవిత్వంలోను తనదైన ముద్ర వేసుకున్న బలమైన గొంతు జూలూరి గౌరీశంకర్ ది. తన తొలి దీర్ఘకవిత రాసిన ఎలియాస్ 2001 నుంచి 2007లో వచ్చిన తెలంగాణ మోదుగుల పొదుగు చెకుముకి రాయి వరకు మొత్తం 14 దీర్ఘకవితల్తో ఏ తెలుగు కవి ఇప్పటి వరకు చేయని, చెరిగిపోని దీర్ఘ సంతకం చేసింది గౌరీశంకరొక్కడే. తను 2005లో రాసిన నాలుగో కన్ను బిసి దీర్ఘకవిత ఒక రోజు, ఒకే సమయానికి దాదాపు 22 కేంద్రాల్లో ఆవిష్కరింపబడటం విశేషం. వివిధ వృత్తుల్లో ఉన్న బిసిలందరు ఏకమైతే రాజ్యాధికారం బీసీలకు దక్కుతుందనేది నిర్వివాదాంశం. 55 బిసిలున్న పరిస్థితుల్లో కూడా దేశంలో ఇంకా బిసిలందరు పీడితులుగానే జీవితాల్ని సాగించడానికి కారణం బిసిలందరి మధ్య ఐక్యత లేకపోవడమే ఒక కారణం కావచ్చు. ఇంకా 1947 కంటే ముందున్నట్లుగానే బిసీల జీవితాలు ఉండటానికి కారణం బిసీలందరు అత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. అందుకే గౌరీశంకర్ నాలుగో కన్ను తెరిచాడు. నాలుగో నేత్రంతో అగ్రవర్ణాలపై విరుచుకుపడ్డాడు. తన లక్ష్యాన్ని, బీసీల బాటను కవిత్వీకరించాడు.

అగ్రవర్ణ కోటా
నా చేతుల మీదుగా ఇవ్వటమే
మహా జనానికి స్వాతంత్రం - అంటూ బీసీలందరి తరఫున ప్రతిజ్ఞ చేస్తున్నాడు.

పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న పోరాటపటిమను బీసీ కులాలు ప్రోది చేసుకోవాల్సిన అవసరాన్ని గౌరీశంకర్ చాలా స్పష్టంగా చెబుతున్నాడు. సహజంగానే గౌరీశంకర్ ఉద్యమ కవి. సంఘటనల మీద, కళ్ల ముందు కనిపించే సమస్యల మీద అంత వేగవంతంగా స్పందించే కవులలో ఈయన అగ్రభాగాన నిలబడతాడు. మార్క్స్ ను చదువుకున్నవాళ్లు అంబేడ్కర్ ను విస్మరిస్తూ వచ్చారు. ఒక రకంగా భారతదేశ నేపధ్యానికి సంబంధించి ఈ కులవ్యవస్థను కూల్చకుండా ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించలేం. ఈ విషయంలో మహాత్మా జోతిరావ్ ఫూలే, పెరియార్, అంబేడ్కర్ తదితరులు చేసిన కృషి మామూలుది కాదు. వీళ్ల కృషిని పరిగణనలోకి తీసుకోకుండా అట్టడుగు వర్గాలకు విముక్తి కలిగిస్తాయన్న కమ్యూనిస్టులు విఫలం చెందారని ఈనాటి బహుజన మేధావులు వాదిస్తున్నారు. ఇందులో నిజం ఉంది. ఈ నిజాన్ని వర్గ దృక్పథంతో వచ్చిన అనేక మంది కవులు, రచయితలు, సామాజిక తత్వవేత్తలు గుర్తించారు.

అందుకే వాళ్లు గళాలు విప్పారు. దేశవ్యాపితంగా దళితులు, బీసీలు ఐక్యమవుతున్నారు. బహుజన వర్గాలు కలిసి కొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టడం కూడా ఒక కొత్త ప్రేరణను కలుగజేసింది. అదే నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రదేశంలోనూ బీసి ఉద్యమం ఊపందకుంది. ఈ నేపథ్యంలో గౌరీశంకర్ తన నాలుగో నేత్రాన్ని తెరిచాడు. ఆవేశంతో నిలువెల్లా ఊగిపోవటమే కాకుండా బీసీల ఐక్యతతోనే మన రాజ్యం వస్తుందని సిద్ధాంతీరకించాడు. ఆ తాత్విక చింతనే ఈ కవితలో కనిపిస్తుంది. ఏదో ఒక అధికార, ప్రతిపక్ష పార్టీలో కొన్ని పదవుల్లో ఉన్నామని చెప్పుకునే దశ నుంచి బీసీలు సొంత కాళ్లపై నిలబడాలని ఆయన కవిత్వంలో పిలుపునిస్తున్నాడు. ఏదో ఒక ఆగ్రవర్ణ నేతృత్వపు జెండాల కింద బీసీలు ఎదగరని ఖరాఖండిగా చెబుతున్నాడు. అందుకే మన శక్తిని తట్టి లేవండంటున్నాడు. బీసీలంతా ఏకం కండి - అప్పుడే బీసీ రాజ్యం వస్తుందని నినదిస్తున్నాడు.

ఉక్కు కొడవళ్లై
గండ్ర గొడ్డళ్లై
నెత్తుటి నరాలలో
నిప్పుల కళ్లతో
అగ్రవర్ణ అధికార భావజాలాంతానికి
ఒక్క ముందుమాట రాయాలి
ఈ నెత్తుటి గోడల్ని కూల్చాలి
ఉదయించుండ్రి తొలిపొద్దులై
పొడవండిరా వేగు చుక్కలై - అంటూ బీసీల శక్తిని చాటుతున్నాడు.

నేడు అధికారాన్ని చెలాయిస్తున్న అగ్రవర్ణాలు విడగొట్టి పాలించు అనే బ్రిటిష్ పాలకుల సూత్రాన్ని యధాతథంగా అమలు చేస్తూ కేవలం రెండు కులాల మధ్య అధికార మార్పిడి చేసుకుంటున్నారు. అధికారాన్ని ఇచ్చేది బీసీలైతే చెలాయించేది రెండు అగ్రవర్ణాలే. అందుకే -

మనమంతా ఏకమై
అనేకమై, అనంతమై
కలగలిస్తేనే - అఖండ భారతం
బీసీలంతా కలగలిస్తేనే
దేన్నైనా కల గనగలం
బిసిలందరిదీ ఏక కంఠమైనప్పుడు
అన్నీ అనుకూలిస్తాయ్ - అంటున్నాడు.

ఆర్థిక అసమానతలకు కారణమైన అసలు ద్రోహులెవరో కనుక్కోవాలి. అసలు కుట్రదారులెవరో మన కళ్ల ముందు జరిగే కారణభూతులెవరో ఆరా తీయాల్సిన అవసరం ఈనాటి బిసి ముందున్న బలమైన ఎజెండా. రాజకీయ నాయకుల్నే కాదు, ఆ రాజకీయానికి అమ్ముడుపోయిన పత్రికల్నీ, టీవీ చానెళ్లను కూడా తన పదునైన పదజాలంతో దుయ్యబడతాడు.

ఫోర్త్ ఎస్టేట్, ఫోర్త్ ఎస్టేట్
నువ్వేమైపోయావ్
పెట్టుబడికి కట్టుబడిపోయావ్
నన్ను నన్నుగా రాయని పత్రికలెందుకు
నా గురించి చెప్పని చానెళ్లెందుకు
గ్లోబల్ కత్తులు కులవృత్తుల చేతివేళ్లను నరికిన వైనాన్ని చెబుతాడు. తరతరాలుగా బీసీ కులాల పనిముట్లకు పదును పెడతాడు. అగ్రవర్ణ కుట్రల్ని ఎండగడతాడు. ప్రపంచీకరణ పేరుతో అంతరిస్తున్న కులవృత్తుల్ని చూసి ఆవేదన చెందుతాడు.

ఇప్పుడు నా మాట
అల్లాటప్పా కవిత్వ పదం కాదు
ఉత్తుత్తి ఆగ్రహ ప్రకటన కాదు
ఆవేశ ప్రకటన కాదు
పీడిత జనవిముక్తి ప్రార్థనాగీతం
బహుజన సంతతి రూపం
మహాజనావళి కసిగీతం - అంటూ

ఉదయానికి ముందు ఎరుపెక్కిన తూరుపులా
ప్రసవానికి ముందు తల్లి పెట్టిన పెనుకేకలా - ముందుకు సాగిపొమ్మని తన కవిత్వం ద్వారా బీసీ కులాలకు కర్తవ్య బోధ చేస్తున్న గౌరీశంకర్ తెలుగు జాతి గర్వించదగ్గ కవి. ఆ శంకరుని మూడో కన్ను ప్రళయానికి సంకేతమైతే మన గౌరీశంకరుని నాలుగో కన్ను అట్టడుగునున్న బీసీ వర్గాల అభ్యున్నతికి బలమైన ప్రతీక.

English summary
Review on Gowrishanker's Nalugo Kannu by Banala Srinivas Rao
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X