ఎడతెగని ప్రయాణికుడు
అప్పటికే సాహిత్యవ్యాసంగం మధ్య సాహిత్యాన్ని ఉద్యమంగా జనంలోకి తీసుకెళ్లే పనిలో నిమగ్నమయ్యారు. యాకూబ్ తొలి కవితా సంపుటి ప్రవహించే జ్ఞాపకం 1992లో వెలువడింది. 1997లో పునర్ముద్రణ పొందింది. 2002లో సరిహద్దు రేఖ కివితా సంపుటి యాకూబ్ ప్రత్యేకతని లోకానికి తెలియపరిచింది. ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు ఎన్నో అందుకున్నారు. మరో వైపున వివిధ భాషల్లోంచి కవిత్వాన్ని, వచన రచనల్ని అనువాదం చేశారు. గుజరాత్ గాయం, మనచేరా, ఖమ్మం గుమ్మం, దేవి30 లాంటి పన్నెండు పుస్తకాలకి సంపాదకత్వం వహించారు. అజంతా అభినందన, ఇస్మాయిల్ అభినందన సభలను ఇష్టంగా ఇష్టంగా భుజాన వేసుకున్నారు. స్వయంగా మూడు విమర్శ పరిశోధన గ్రంథాలను వెలువరించారు. తెలుగు సాహిత్య విమర్శ - ఆధునిక ధోరణులు అంశం మీద పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు.
యాకూబ్ కవిత్వం ఇంగ్లీషు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడం భాషల్లోకి అనువాదమైంది. భిన్న అస్తిత్వాలు, వాదాలు కొనసాగుతున్న తెలుగు సాహిత్య ప్రపంచంలో సాహిత్యకారునిగా, కార్యకర్తగా, ఉద్యమకారునిగా తనదైన ముద్రని కనబరిచారు. ఒకే ఒక మాటలో చెప్పాలంటే అనేకానేక ఒడిదుడుకుల నడుమ, జీవితపు ఒత్తిళ్ల నడుమ కవిగా తనని తాను బతికించుకోవడం యాకూబ్ సాధించిన సాఫల్యం. ఆ సాఫల్యపు ఆనవాళ్లు ఎడతెగని ప్రయాణం సంపుటిలో మరింత పారదర్శకంగా, ఆర్ద్రంగా కనిపిస్తాయి. యాకూబ్ ప్రస్తుతం హైదరాబాదులోని అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజీలో తెలుగుశాఖలో రీడర్ గా పనిచేస్తున్నారు.