భరద్వాజకు జ్ఞానపీఠ్ అవార్డు
ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మూడో తెలుగు రచయిత రావూరి భరద్వాజ. ఆయన కన్నా ముందు ఈ అవార్డు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు, డాక్టర్ సి. నారాయణరెడ్డికి ఈ అవార్డు లభించింది. భరద్వాజ 2011లో త్రిపురనేని గోపీచంద్ పురస్కారాన్ని, 2009లో లోక్నాయక్ పౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో రావూరి భరద్వాజ 1927లో జన్మించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా తాడికొండకు వలస వెళ్లారు. 17వ యేటనే కలం పట్టిన ఈయన 130కి పైగా గ్రంథాలు రాశారు. కథనాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, విజ్ఞాన శాస్త్రం, బాల సాహిత్యం వెలువరించారు. 1948లో దీనబంధు పత్రికలో జర్నలిస్టుగా సేవలందించారు. జ్యోతి, సమీక్ష, అభిసార, చిత్రసీమ వంటి సినిమా పత్రికల్లో పనిచేశారు. 1959లో ఆకాశవాణిలో చేరారు.
1983లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందారు. నాలోని నీవు, అంతరంగిణి, ఒక ఏకాంతం, ఒకింత వేకువ కోసం వంటి కవితా సంకలనాలు రచించారు. భరద్వాజ రచించిన కౌముది, హిందీ, గుజరాతీ భాషల్లోకి అనువాదమైంది. ఆత్మగతం, బానుమతి, దూరపుకొండలు, జీవనాడి, మనోరత్నం, నీరు లేని నది, సశేషం, స్వప్నసీమలు, స్వర్ణమంజరి వంటి 11 నాటకాలు రచించారు. బాల సాహిత్యానికి సంబంధించి 33 పుస్తకాలు రచించారు. పిల్లల కోసం ఏడు నవలలు రాశారు.
భరద్వాజ 1968, 1983ల్లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో ఆయనను సత్కరించింది. జెఎన్టిలు 1980లో, నాగార్జున విశ్వవిద్యాలయం 1977లో గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశాయి.