'కొత్త పలక' రివ్యూ: సామాన్యుని ఇజం
సునుశితమైన సామాజిక పరిశీలన, వస్తువుపట్ల అవగాహన, వ్యక్తీకరణలోస్పష్టత కవికి మౌలిక అవసరాలు. నిజాయితీ, నిర్మొహమాటంగాకుండ బద్దలుకొట్టడం అదనపు అర్హతలు. ఏనుగు నరసింహా రెడ్డి కవిత్వం చదివాక నిజానికి నాకు ఈ అర్హతల్లో స్పష్టత ఏర్పడింది. ఆయన నిర్భీతి కొంత భీతి గొలిపింది.అయన కవిత్వంలో మనం ఊహించని ఒకధ్వని ఉంటుంది. సాధారణ విషయాన్నిచెప్పినట్లే చెప్పి ఉన్నట్లుంది జనరలైజ్ చేస్తాడు.
లక్ష్మి సెహగల్పేరు రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి చర్చకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గందరగోళానికి గురయ్యాడట. ఆ పేరే ఎప్పుడు వినలేదే అనిఆశ్చర్య పోయాడట. దానికి ఈకవి ఎంత ఆవేశ పడ్డాడో చూస్తే ఆయనలోని నిజాయితీ మనల్ని చకితుల్ని చేస్తుంది. సంవాదంలాకొనసాగే ఈ కవితలో -

'ఆమేమైనా ప్రపంచబాంకు బ్రోకరా?
పత్రికలకు లీకరా?
మలేశియాలోనో, స్విస్సులోనోమీడియేటరా?
ఆమె నీకెట్లాతెలుస్తది? - అంటూ ఎత్తుకొని -
అయినా చరిత్రహీనులకు
చరిత్ర గురించి తెలియక పోవడం
ఆశ్చర్యం కాదు' - అని జాడిస్తాడు. నిలదీస్తాడు. ఇక్కడ చరిత్రఅనే మాటనుపదేపదే ప్రయోగించడంద్వారా చంద్రబాబుచరిత్ర అనేసబ్జెక్టుకే వ్యతిరేకి అనే భావాన్ని స్ఫురింపజేస్తున్నాడు. ఎంతో స్ట్రేట్ పోయెమ్గా కనిపించే కవితలో ఈయన సాధించిన ధ్వని అనూహ్యం. బహుశా ఇదొక్కటే ఈ సంకలనంలోఇదివరకు పత్రికల్లో ప్రచురింపబడని కవిత. కవి నిర్భీతికి, స్పష్టతకి అద్దంపట్టే మరో కవిత నిజవార్త. సుంకిరెడ్డి గారన్నట్లు పత్రికలను విమర్శించడానికి కవులు కూడా ధైర్యం చేయరు. నరసింహారెడ్డి చేసారు.
'ఎక్కడ మొదలైందోతెలియనట్లే
ఎక్కడ ముగుస్తుందోఎవరికీ అర్ధం కాదు' - అంటాడు కాలాన్ని.
'కొందరు నగలేసుకుంటారు
కొందరు చిరునగవేసుకుంటారు' - అంటాడు మనుషుల్ని.
'ఉన్నవారికి ఆస్తులు
లేని వారికిప్రేమలు
ఒకరికున్నై ఒకరికుండవు' - అని తేల్చేస్తాడు పేదలపక్షపాతయి.
నరసింహారెడ్డి కవిత్వంలో వస్తు వైవిధ్యంఎ క్కువ. ఈయన ఉద్యమం గురించి రాస్తాడు. ఉద్యోగుల వేదనల్ని రాస్తాడు. సామాన్యుల బాధలను పట్టించుకుంటాడు. రాజకీయాలు, వాటి ఎజెండాలు మాత్రమే కాక ఆ ఎజెండాల మాటున నీరైపోతున్న ప్రజల ఆశలను పట్టుకుంటాడు.
చేసిన వాదాలు, నిర్మించిన ఉద్యమాలు, ఎలుగెత్తిన నినాదాలు అన్నీ చివరికి వోట్లబాట పట్టడం ప్రజాస్వామ్య విషాదం. కేవలం మూక మెజారిటీల లెక్కలు న్యాయాన్నినిలబెట్టగలవా? కేవలం వోట్ల ద్వారానే ప్రజాసమస్యలు పరిష్కారం కాగలవా? సగటు భారతీయ మేధావిలాగానే నరసింహారెడ్డికి అనేక సందేహాలున్నాయి. అందుకే-
' ఇందరు మేకవన్నెపులుల్లో
ఏ మృగానికిజేకోడదాం ?
ఏ పులినోటికి చిక్కుదాం?
ఏ గుద్దేలుక్కిమనం దక్కుదాం?' - అని వాపోతాడు.
నరసింహా రెడ్డికి పల్లె మీద ప్రేమ, అందరు కవుల్లాగే. కాని ఈయన పల్లె మన చూపులకు చిక్కిందే కాని మనరాతల్లో ఇంత సజీవంగా ఉందాఅని అచ్చెరువుగొలుపుతుంది.
'అప్పుడు ఊరు పైసలతో కాదు
పసిరికతో జీవించేది
.........................
మొగురాలు పిల్లర్లు కాక ముందు
అరుగుల చోటపార్కింగులు రాక ముందు
విశాలమైన పెంకుటిండ్లు
ఇరుకు ఇందిరమ్మపైంటింగులు కట్టక ముందు
షట్టెర్లు జారకముందు
సహేతుకమైన వేతనంతోసరియైన పనిదొరక్క
యువత బ్రోకేర్లుగామారకముందు
ఇక్కడొక ఉరుండేది
ఎవరైనా చూపిస్తారా' - అని ప్రశ్నిస్తూ ఆనాటి పల్లెల స్వచ్చతను, ఈనాటి ధ్వంసాన్నికళ్ళకు కడతాడు. తమ స్వంత ఊరంటే కవులకు ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. నరసింహారెడ్డి తన ఊరి గురించి రాస్తూ తన్మయుడై పోతాడు. మళ్ళీ అక్కడికే పోవాలంటాడు. గుట్టను తాకిన మబ్బుల్లో రంగుల గుడారమేసిన ఆకాశపు బంగారువర్ణం చూడాలె అంటాడు. తలపుల వీణను తట్టి చూడాలె అంటాడు. అక్కడ రాలిపోయిన కళల శకలాలున్నాయి. జాగ్రత్తగా ఏరుకోవాలే అంటాడు.
సున్నితమైన భావాలను సరళమైన వాక్యాలల్లో రాసిన పాదాలు చదవగానే హృదయానికి హత్తుకు పోతాయి. ఆ వెనువెంటనే మరో అద్భుతమైన వాక్యం వేస్తాడు. అది సమజానికి నిలువుటద్దమై, కవిత్వమై పాఠకుల్ని అలరిస్తుంది. కవిత్వపు ఆల్కెమీ అదే కాబోలు! స్వర్గలోకాన్ని తాకి రావాలని నంది వర్ధనం గేటెక్కి చూస్తుందట. పక్షులు నిశ్శబ్దాన్ని సాధన చేస్తుంటాయట. శీతాకాలపు సాయంత్రాన్నిఅద్భుతంగా వర్ణిస్తూ చలి తల్లి దాక్కునేందుకుకూడా పేద బతుకులే ఆశ్రయమిస్తాయని కవిత ముగిస్తాడు. ఈ టెక్నికాలిటీస్ కవితల్లో ఒడుపుగా ప్రయోగించాడు నరసింహా రెడ్డి. చూడండి
భవనాలు పైపైకి
మమకారాలు లోలోపలికి
***
పిల్లలు పిట్టలై
ఎగిరిపోతారు
పెద్దలు పక్వమై
సర్దుకుంటారు
ఇప్పుడు మహాలంతాఒంటరి
దాన్నిండా చీకటి
***
నిండు గొబ్బెమ్మలా
చెరువు సంబూరపడుతున్నప్పుడు
కట్ట మొదట్లోగండి పడ్డట్లు
అంగట్లో ఎద్దుబెదిరినట్లు
ఎవరు ఎవరికీశత్రువో అర్ధంకాని
చిక్కు ప్రశ్నసంధిస్తూ
రంగుల రాట్నంకుప్ప కూలింది
నరసింహా రెడ్డిజ్గాపకాల తడికి, కవిత్వ ధోరణికి, ఆయనహృదయ లక్షణాన్నిపట్టి ఇవ్వడానికిపనికి వచ్చేకవిత కొత్తపలక. ఆనాటిపలక గురించిమాట్లాడుతూనే జీవితపు పరమ సత్యాల్ని అత్యంతసరళంగా చెప్పుకొస్తాడు. పలక పగిలిపోవద్దనివాళ్ళమ్మ హెచ్చరిస్తే ఈ కవికి భవిషత్తులోగట్టిగా ఉండాలనిఅర్ధమయిన్దట. టీచరు గీతలు కొట్టిస్తే ఈయనకుతప్పు దొరికిందట. అందుకేఅంటాడు
ఇప్పుడొక పలక దొరికితే బాగుండు
చెరిపి రాయాల్సిన జీవితపు పాఠాలు
చాలా గుర్తుకొస్తున్నాయి
తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎన్నోపదాల్ని ఈయన కవిత్వంలో ఉపయోగించి కవిత్వాన్ని సజీవం చేసాడు. అవి అన్నిప్రాంతాలకు కూడా సరలన్గానే అర్దమవుతున్నాయి. కొత్త పలక మంచి కవిత్వాన్ని చదివిన అనుభూతిని మిగుల్చుతుంది. ఆయన అక్షరాల్లో నిజముంది. అయన కవిత్వంలో సామాన్యుని ఇజముంది. ఆలోచనల్లో అరుదైన సృజన ఉంది. వర్తమానాన్ని వస్తువుగా స్వీకరించిన కవి పాఠకున్నివేలు పట్టుకొని భవిష్యత్లోకి తీసుకెళతారు.
-వై. హెచ్. కె. మోహన్ రావు












Click it and Unblock the Notifications