చంద్రుడిపై కుప్పలు తెప్పలుగా మంచు దిబ్బలు- ఒక్కసారి కరిగితే సముద్రాలే
విశ్వంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. మనిషి తన జీవితకాలంలో ఏనాడూ చూడని మహాద్భుత దృశ్యం అది. చందమామకు అవతలి వైపు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. దీన్ని ఆర్టెమిస్ 2 వ్యోమగాములు స్వయంగా వీక్షించారు. మనం రోజూ చూసే చంద్రుడికి ఇవతలి వైపు కంటే ఎంతో భిన్నంగా కనిపించిందా సూర్యగ్రహణం. ఇక్కడి కంటే సుదీర్ఘ గ్రహణ కాలం అది. గ్రహణం చీకటిలో ఆర్టెమిస్ 3 నౌక ప్రయాణం ప్రారంభమైందంటే అది ఎంత భిన్నమైనదో అర్థం చేసుకోవచ్చు.
అదే సమయంలో చంద్రయాన్-2 ఆర్బిటర్ డేటా.. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలోని చీకటి బిలాల ఉపరితలం దిగువన మంచు నీటి జాడలను గుర్తించింది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ (DFSAR) ద్వారా ఈ కీలక పరిశోధన సాధ్యమైంది. చంద్రయాన్-2 మిషన్ను ప్రారంభించిన ఏడేళ్ల తర్వాత.. దాని ఆర్బిటర్ ఇప్పుడు దక్షిణ ధృవంలోని కింద నీరు.. మంచు రూపంలో ఉందనడానికి బలమైన ఆధారాలను అందించింది. చంద్రుడిపై సాగిస్తోన్న అన్వేషణలో ఓ కీలక ఆవిష్కరణకు తెర తీసింది.

దక్షిణాన ఉన్న ఈ చీకటి బిలాల్లో వెలుగు అనేది అసలు ప్రసరించదు. శాశ్వతంగా ఇవి బిలాల అంచుల నీడలోనే ఉంటాయి. సూర్యరశ్మి ఏ మాత్రం సోకని ప్రాంతం కావడం వల్ల అక్కడ వెలుగు ఉండదు. డీఎఫ్ఎస్ఏఆర్ పంపించిన డేటా, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు డబుల్లీ షాడోడ్ క్రేటర్స్ ను విశ్లేషించారు. సూర్యరశ్మి చేరని, మైనస్ 248 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఈ ప్రాంతాల్లో నీరు.. మంచు రూపంలో బిలియన్ల సంవత్సరాల నుంచీ నిల్వ ఉంటోందని నిర్ధారించారు.
అత్యాధునిక రాడార్ పోలారిమెట్రీతో ఈ శాస్త్రవేత్తల బృందం తాజా పరిశోధనలను నిర్వహించింది. నాలుగు బిలాలలో ఉపరితలం కింద మంచు ఉన్నట్లు సంకేతాలను గుర్తించింది. ఫాస్టిని బేసిన్ లోపల ఉన్న 1.1 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక బిలంలో దీనికి సంబంధించిన బలమైన ఆధారాలు, రాడార్ ప్రతిబింబాలు, లోబేట్ రిమ్ నిర్మాణాలు ఉన్నాయి. వీటిని.. మంచు జాడలు ఉన్నాయనడానికి ప్రధాన సూచికగా పరిగణిస్తోన్నారు.
శాశ్వత నీడలో ఉండే బిలాల్లో మంచు నిల్వలతో పాటు సమీప పర్వత శిఖరాలపై విద్యుత్ ఉత్పత్తికి నిరంతర సూర్యరశ్మి లభ్యం కావడంతో, ఈ ప్రాంతాన్ని స్థావరాలుగా మార్చుకోవచ్చని నాసా భావిస్తోంది. చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా ఈ దిశగా ప్రయోగాలు చేపట్టింది. 2030 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని ప్రణాళికలు రచిస్తోంది. 2030 తర్వాత రష్యాతో కలిసి ఇంటర్నేషనల్ మూన్ సెంటర్ ను నిర్మించాలని భావిస్తోంది.
ఇదివరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కూడా ఇటువంటి పరిశోధనలను నిర్వహించిన విషయం తెలిసిందే. హైరిజల్యూషన్ ఆర్బిట్ ఫొటోలను ఉపయోగించి 85 నుండి 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాల పరిధిలోకి శాశ్వత నీడలో ఉండే చంద్ర బిలాలను మ్యాపింగ్ చేశారు. వీటి లోతు 20 మీటర్లకు పైమాటే. దాదాపు 74 శాతం శాశ్వత నీడ ప్రాంతాలు బిలాల ప్రభావం వల్ల చెక్కుచెదరలేదని గుర్తించారు. సూక్ష్మ ఉల్కాపాతాలు సంభవించినప్పుడు చంద్రుడి ఉపరితలంపై కలిగే మార్పులు పరిమితంగానే ఉన్నాయని, అవి ఢీ కొట్టినప్పుడు మంచు నిక్షేపాలకు ఎటువంటి విఘాతం కలగలేదని తేల్చారు.












Click it and Unblock the Notifications