నాటి పరాజయం నుంచి పాఠాలు: 4న ఇస్రో కీలక ప్రయోగం- ఎర్త్ అబ్జర్వేషన్ లో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమైంది. ఎర్త్ అబ్జర్వేషన్ లో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ఇఓఎస్-05 (EOS-05) ఉపగ్రహాన్ని ఈ నెల 4వ తేదీన ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఈ శాటిలైట్ ను మోసుకుంటూ జీఎస్ఎల్వీ ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లనుంది. దేశ సరిహద్దులను నిరంతరం పర్యవేక్షించడానికి, ఎప్పటికప్పుడు వాతావరణాన్ని అంచనా వేయడానికి ఈ ప్రయోగం ఎంతో కీలకం కానుంది.
ఈ ప్రయోగం ఇస్రోకు ఎంతో ప్రతిష్టాత్మకం. దీనికి కారణం లేకపోలేదు. 2021 ఆగస్టులో జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 ప్రయోగం విఫలం కావడంతో భారత్ తన జీశాట్-1 ఉపగ్రహాన్ని కోల్పోయింది. ఆ పరాజయం నుంచి నేర్చుకున్న పాఠాలతో తాజా మిషన్ లో పలు సాంకేతిక సవరణలు చేసింది. మరింత అనుభవంతో ఇప్పుడు ఇస్రో ఈ ఇఓఎస్-5 కు తుది రూపాన్ని ఇచ్చింది. నాటి ఆ మిషన్కు ఇది ప్రత్యామ్నాయంగా దీన్ని ప్రయోగించబోతోంది.

సాధారణంగా ఎర్త్ అబ్జర్వేషన్ లో ఉండే ఉపగ్రహాలు లో ఎర్త్ ఆర్బిట్లో పరిభ్రమిస్తుంటాయి. ఈ రకమైన ఉపగ్రహాలు ముందుగానే నిర్దేశిత పాత్ వే లో ప్రయాణిస్తుంటాయి. రోజులో కొద్ది సమయం మాత్రమే భూమిపై సూచించిన ప్రాంతాన్ని వీక్షిస్తాయి. తాజా ఉపగ్రహం దీనికి పూర్తి భిన్నం. దీనిని భూమికి సుమారు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే జియోస్టేషనరీ ఆర్బిట్ అంటే.. భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనుంది ఇస్రో. భూభ్రమణ వేగానికి అనుగుణంగా ఇది కూడా తిరుగుతుంటుంది. ఫలితంగా నిరంతరం భారత భూభాగంపైనే నిఘా ఉంచగలుగుతుంది.
ఈ శాటిలైట్ ప్రతి 30 నిమిషాలకు ఒకసారి భారత్, దాని సరిహద్దులు, పొరుగున ఉన్న దేశాల భూభాగాలను హైరిజల్యూషన్ ఫొటోల రూపంలో అందిస్తుంది. ఏదైనా ఓ ప్రాంతాన్ని మరింత నిశితంగా పర్యవేక్షించాల్సి వస్తే.. అయిదు నిమిషాల వ్యవధిలోనే దానికి సంబంధించిన హెచ్ డీ ఫొటోలను ఈ శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్ కు పంపించగలుగుతుంది. ఇంత వేగంగా డేటా లభించడం అనేది విపత్తు సమయాల్లో ఎంతగానో సహాయపడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ కు భారీ ప్రయోజనం చేకూరుతుంది.
బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర పరివాహక ప్రాంతాల్లో అకస్మాత్తుగా ఏర్పడే తుపాన్లు, విస్తారంగా కురిసే భారీ వర్షాల వల్ల సంభవించే వరదలు, కార్చిచ్చు వంటి విపత్తులను ముందస్తుగా పసిగట్టడానికి ఇది తోడ్పడుతుంది. పర్యవసానంగా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించే వీలు కలుగుతుంది. వ్యవసాయ విస్తీర్ణత, నేల స్వభావం, రిజర్వాయర్లల్లో నీటి నిల్వలను ఖచ్చితంగా అంచనా వేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
అన్నింటికంటే ముఖ్యంగా వ్యూహాత్మక రక్షణ రంగంలో ఇఓఎస్-5 ఓ గేమ్ చేంజర్ కానుంది. పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలు ఉన్న నేపథ్యంలో భద్రత బలగాలకు స్పష్టమైన సమాచారాన్ని అందించడానికి ఈ శాటిలైట్ ఉపయోగపడుతోంది. 36,000 కిలోమీటర్ల ఎత్తు నుండి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడం సవాల్. దీన్ని అవలీలగా అధిగమించగలుగుతుందీ శాటిలైట్.













Click it and Unblock the Notifications