ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన ఇటలీ మాస్టర్ ప్లాన్! పీతల రక్తం తాగే ఆక్టోపస్లు!
ఇటలీ తీర ప్రాంతాల్లో సముద్ర ఉత్పత్తులపై ఆధారపడి బతుకుతున్న మత్స్యకారులకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చిపడింది. అక్కడ విపరీతంగా పెరిగిపోయిన నీలి రంగు పీతలు స్థానిక సముద్ర వాతావరణాన్ని నాశనం చేయడమే కాకుండా, బిలియన్ల విలువైన వేటను దెబ్బతీస్తున్నాయి.
మత్స్యకారుల వలలను కత్తిరించడం, స్థానిక పిడిబాతులు, గుల్లకప్పలు (షెల్ ఫిష్, క్లామ్స్) వంటి విలువైన జీవులను గుల్ల చేయడం ఇవే పనిగా పెట్టుకున్నాయి. దీనివల్ల వందలాది ఫిషింగ్ కంపెనీలు మూతపడగా, ఇటలీ ఆర్థిక వ్యవస్థకు పదుల మిలియన్ల యూరోల మేర కోలుకోలేని నష్టం వాటిల్లింది. సాధారణ పద్ధతుల్లో వీటి సంఖ్యను అదుపు చేయడం సాధ్యం కాకపోవడంతో ఇటలీ ప్రభుత్వం ఓ వినూత్న విప్లవానికి శ్రీకారం చుట్టింది.

ఆక్టోపస్ల సైన్యం రంగంలోకి.. ప్రకృతికి ప్రకృతితోనే విరుగుడు!
పీతల అరాచకానికి చెక్ పెట్టేందుకు ఇటలీ సైంటిస్టులు ఒక ఆసక్తికరమైన సముద్ర యుద్ధానికి పథకం రచించారు. అదేంటంటే.. పీతలను వేటాడి తినే ఎనిమిది కాళ్ల ఆక్టోపస్లను పెద్ద ఎత్తున సముద్రంలోకి దింపడం. బోలోగ్నా విశ్వవిద్యాలయ పరిశోధకులు, ఎమిలియా-రొమాగ్నా ప్రాంతీయ ప్రభుత్వంతో కలిసి 'ఆక్టో-బ్లూ' అనే ప్రత్యేకాపరేషన్ను ప్రారంభించారు.
ఇందులో భాగంగా గుడ్ల నుంచి బయటకు వచ్చిన దాదాపు 1,30,000చిన్న ఆక్టోపస్ పిల్లలను అడ్రియాటిక్ సముద్రంలోకి విడుదల చేశారు. ఇవి నీటి అడుగున పెరిగి పీతలను ఏరిపారేస్తాయని భావిస్తున్నారు. సముద్రంలో వీటికి కొత్త ప్రమాదాలు ఎదురవకుండా ఉండేందుకు నీటి అడుగున కృత్రిమ స్థావరాలను కూడా సైంటిస్టులు ఏర్పాటు చేశారు.
రోజుకు నాలుగు పీతలను నమిలిమింగే వేటగాళ్లు
బయట నుంచి వేరే జీవులను తెచ్చి వదిలితే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. కానీ, ఆక్టోపస్ అనేది స్థానికంగా అడ్రియాటిక్ సముద్రంలోనే సహజంగా పెరిగే జీవి. అందుకే ఈ పద్ధతిని ఎంచుకున్నారు. ఒక కేజీ బరువుండే ఒక సాధారణ ఆక్టోపస్ తన ఆకలి తీర్చుకోవడానికి రోజుకు కనీసం నాలుగు నీలిపీతలను ఈజీగా నమిలి మింగేస్తుంది. పీతల సంఖ్య విపరీతంగా పెరగడానికి ఆక్టోపస్ల సంఖ్య తగ్గడం కూడా ఒక కారణమేనని గుర్తించిన సైంటిస్టులు, ల్యాబ్లలో ఆక్టోపస్ పిల్లలను పెంచి, సముద్రంలో పీతల ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వదిలిపెడుతున్నారు.
ఈ వినూత్న ప్రయోగం సక్సెస్ అవుతుందా?
అయితే ఈ ప్రయోగం వినడానికి చాలా బాగున్నా, ఇందులో కొన్ని సవాళ్లు ఉన్నాయని సముద్ర పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆక్టోపస్ పిల్లల మరణాల రేటు సముద్రంలో చాలా ఎక్కువగా (దాదాపు 99.9 శాతం) ఉంటుంది. వదిలిన పిల్లల్లో చాలా కొద్ది మాత్రమే పెద్దవిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ 'ఆక్టోపస్ సైన్యం' వల్ల పీతలు పూర్తిగా అంతరించిపోవు గానీ, వాటి సంఖ్య పరిమితికి మించకుండా అదుపులోకి వస్తుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మత్స్యకారులు నేరుగా పీతలను వేటాడే కార్యక్రమాలను వేగవంతం చేస్తూనే, ఈ జీవశాస్త్ర యుద్ధాన్ని ఇటలీ కొనసాగిస్తోంది. సముద్రపు రాక్షసుడిపై ఎనిమిది కాళ్ల దండయాత్ర ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి!














Click it and Unblock the Notifications