ఇస్రోకు కొత్త అధినేత..!!
ISRO Chairman: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రోకు కొత్త అధినేత రాబోతోన్నారు. ప్రస్తుతం ఛైర్మన్గా వ్యవహరిస్తోన్న ఎస్ సోమ్నాథ్ పదవీ కాలం ముగియబోతోంది. దీనితో కొత్త ఛైర్మన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది.
సీనియర్ స్పేస్ సైంటిస్ట్ వీ నారాయణన్.. ఇస్రోకు కొత్త చీఫ్గా అపాయింట్ అయ్యారు. ఈ నెల 14వ తేదీన ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. రెండు సంవత్సరాల పాటు అంటే 2027 జనవరి 14వ తేదీ వరకు ఈ హోదాలో కొనసాగుతారు. అలాగే- డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

ప్రస్తుతం ఆయన కేరళలోని వలియమాలాలో ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ చీఫ్గా పని చేస్తోన్నారు. స్పేస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఛైర్మన్గా ఉన్నారు.
ఇస్రో శాస్త్రవేత్తగా 40 సంవత్సరాల అనుభవం ఉందాయనకు. 1984లో ఇంజినీర్గా ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగారు. రాకెట్, స్పేస్క్రాఫ్ట్ ప్రొపల్షన్లో ఆయన నిపుణుడు. లిక్విడ్, సెమీ క్రయోజెనిక్, క్రయోజనిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ విభాగాలపై ఆయనకు మంచి పట్టు ఉంది.
ఐఐటీ- ఖరగ్పూర్లో క్రయోజనిక్ ఇంజినీరింగ్లో ఎంటెక్ చదివారు. అక్కడే ఏరో స్పేస్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ చేశారు వీ నారాయణన్. ఎంటెక్లో సిల్వర్ మెడల్ అందుకున్నారు. రాకెట్- అనుబంధ రంగంలో ఆయనకు ఉన్న ప్రతిభను గుర్తించి ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా బంగారు పతకాన్ని అందించింది.
నారాయణన్ బాధ్యతలను స్వీకరించిన వెంటనే నేవిగేషన్ శాటిలైట్ (ఎన్వీఎస్) 2 మిషన్పై పని చేసే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన ఎన్వీఎస్ 1కు కొనసాగింపుగా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించబోతోంది ఇస్రో. దీనికి రంగం సిద్దమైంది. ఈ నెల చివరివారంలో ఈ ప్రయోగం చేపట్టవచ్చు. దీనికోసం జియోసింక్రనైజ్డ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ను ఉపయోగించనుంది.
గత ఏడాది మే 29వ తేదీన ఎన్వీఎస్ 1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. జీఎస్ఎల్వీ- ఎఫ్ 12 రాకెట్ను దీనికోసం ఉపయోగించిందప్పట్లో. 2,232 కేజీల బరువు ఉన్న ఉపగ్రహం అది. జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో విజయవంతంగా అడుగుపెట్టింది. నిరంతరాయంగా తన సేవలను అందిస్తోంది.












Click it and Unblock the Notifications