మనిషి శరీరంలో పంది లివర్, కిడ్నీలు! ఎలా పని చేశాయంటే!
వైద్య శాస్త్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖితమైంది. అవయవాల కొరతతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి సరికొత్త ఆశాకిరణం చూపిస్తూ చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. బ్రెయిన్ డెడ్ (మెదడు మరణం) అయిన ఒక వ్యక్తికి ఒకే సమయంలో పంది కాలేయంతో పాటు, రెండు మూత్రపిండాలను విజయవంతంగా మార్పిడి చేశారు. జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే 'జెనోట్రాన్స్ప్లాంటేషన్' చరిత్రలో.. ఒకేసారి ఇలాంటి మల్టీ-ఆర్గాన్ (బహుళ అవయవాల) మార్పిడి జరగడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనాలోని 'సెకండ్ అఫిలియేటెడ్ హాస్పిటల్ ఆఫ్ గ్వాంగ్జీ మెడికల్ యూనివర్సిటీ' పరిశోధకులు ఈ సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. దురదృష్టవశాత్తూ మెదడు మరణం సంభవించిన ఒక 53 ఏళ్ల వ్యక్తిపై ఈ ప్రయోగం నిర్వహించారు. సాధారణంగా ఇలాంటి ప్రయోగాల్లో అవయవాలను వేరే చోట అమర్చుతుంటారు, కానీ ఈ సర్జరీలో వైద్యులు రోగిలోని సహజ అవయవాలను పూర్తిగా తొలగించి, సరిగ్గా అవే స్థానాల్లో జన్యుమార్పిడి చేసిన పంది అవయవాలను అమర్చారు. వైద్య పరిభాషలో దీనిని 'ఆర్థోటోపిక్ ట్రాన్స్ప్లాంటేషన్' అని పిలుస్తారు. దీనివల్ల ఆ అవయవాలు మానవ శరీరంలో చాలా సులభంగా ఇమిడిపోయాయి.
గంటల్లోనే పనిచేయడం స్టార్ట్..
ఈ శస్త్రచికిత్స ముగిసిన కొద్ది గంటల్లోనే ఆ పంది అవయవాలు మనిషి శరీరంలో అద్భుతంగా స్పందించాయి. కాలేయం, రెండు మూత్రపిండాలు దాదాపు ఐదు రోజుల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా ఎంతో సమర్థవంతంగా పనిచేశాయి. ఆ తర్వాత రోగి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఈ పరిశోధనను వైద్యులు స్వచ్ఛందంగా నిలిపివేశారు. వైద్య రంగాన్ని మలుపు తిప్పే ఈ చారిత్రాత్మక ప్రయోగానికి సంబంధించిన కీలక వివరాలను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మెడికల్ జర్నల్ 'మెడ్' (Med) మే 29న ప్రచురించింది.

జన్యు మార్పిడితోనే సాధ్యమైంది!
మానవ శరీరం వేరే జంతువుల అవయవాలను అంత సులభంగా స్వీకరించదు. రోగనిరోధక శక్తి వాటిని తిరస్కరిస్తుంది (Organ Rejection). ఈ పెద్ద సమస్యను అధిగమించడానికి శాస్త్రవేత్తలు ఒక ముందస్తు ప్లాన్ చేశారు. వారు పంది అవయవాలలో రోగనిరోధక శక్తి తిరస్కరణకు కారణమయ్యే మూడు జన్యువులను పూర్తిగా తొలగించారు. వాటి స్థానంలో.. మానవ శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించే, అవయవ స్వీకరణను మెరుగుపరిచే మూడు మానవ జన్యువులను ఆ పందికి చేర్చారు. ఈ 'జెనెటిక్ మోడిఫికేషన్' (జన్యు మార్పులు) వల్లే పంది అవయవాలు మానవ శరీరంలో విజయవంతంగా పని చేయగలిగాయి.
ఎందుకు పందులనే ఎంచుకుంటున్నారు?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అవయవదాతల కొరత తీవ్రంగా ఉంది. సరైన సమయంలో అవయవాలు దొరకక ప్రతిరోజూ వేలాది మంది ప్రాణాలు వదులుతున్నారు. ఈ క్రమంలోనే 'జెనోట్రాన్స్ప్లాంటేషన్' పై పరిశోధనలు వేగం పుంజుకున్నాయి. పందుల అవయవాలు పరిమాణంలో, వాటి పనితీరులో దాదాపు మానవ అవయవాలను పోలి ఉంటాయి. అంతేకాకుండా, కోతులు లేదా ఇతర జంతువులతో పోలిస్తే పందుల ద్వారా మనుషులకు కొత్త వ్యాధులు ప్రబలే ముప్పు చాలా తక్కువ. అందుకే శాస్త్రవేత్తలు వీటిపైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
భవిష్యత్తుకు ఆశాకిరణం..
గతంలో జరిగిన ప్రయోగాలు కేవలం ఒకే ఒక అవయవ మార్పిడికి పరిమితమయ్యాయి. కానీ, ఒకేసారి లివర్, కిడ్నీల లాంటి బహుళ అవయవాలను మార్పిడి చేయడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. సుదీర్ఘకాలం పాటు ఈ అవయవాలు ఎలా పనిచేస్తాయి? రోగనిరోధక అనుకూలత ఎంతవరకు ఉంటుంది? అనే సవాళ్లు ఇంకా మిగిలి ఉన్నప్పటికీ.. అవయవాల వైఫల్యంతో మరణ అంచుల్లో ఉన్న లక్షలాది మంది రోగులకు చైనా శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయం భవిష్యత్తులో ఒక సంజీవనిలా మారబోతోందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications