ఎబిఎన్పై సుప్రీం ఆదేశాలు: ప్రసారాల నిలిపివేత కథాకమామిషు
హైదరాబాద్: ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' ప్రసారాలను పునరుద్ధరించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఎదురు దెబ్బనా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ మేరకు కేంద్రం, తెలంగాణ ఎంఎస్ఓలకు సుప్రీం కోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
అంతేకాదు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లకూ ఆదేశాల ప్రతులను పంచాలని, అవసరమైతే ఎంఎస్ఓలకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీవీ9 ఛానల్ విషయంలో పాటించిన టీడీశాట్ ఆదేశాలను ఏబీఎన్ విషయంలోనూ అమలు చేయాలని స్పష్టం చేసింది.
మంగళవారం నాటికి ఏబీఎన్ ప్రసారాలు నిలిచిపోయి 506 రోజులు గడిచాయి. జస్టిస్ ఖేహర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్బి లోకూర్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ జూన్ 2వ తేదీన బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2014 జూన్ 16న తెలంగాణకు చెందిన ఎంఎస్వోలు రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేశాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ను కించపరిచడం, ఎమ్మెల్యేలను చులకన చేస్తూ కార్యక్రమాలను ప్రసారం చేసినందుకే ఈ రెండు చానళ్లను నిలిపివేస్తున్నట్టు ఎంఎస్ఓలు సైతం ఓ ప్రకటన చేశారు ఈ చానళ్లు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానిస్తున్నాయని ఆరోపించారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను చులకన చేసేలా వ్యంగ్య కార్యక్రమం ప్రసారం చేశారంటూ టీవీ9పై నిషేధానికి నేరుగా తెలంగాణ ప్రభుత్వమే రంగంలోకి దిగింది. వరంగల్లో నిర్వహించిన ఓ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణను అవమానించే చానల్స్ తమకు అక్కర్లేదని, తెలంగాణ గడ్డపై ఉండాలంటే, ఈ ప్రాంతానికి సలాం కొట్టాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
'పాచికల్లు తాగే మొఖాలంటే క్షమించాలా అని తీవ్రంగా ప్రశ్నిస్తూ, పాతర, పాతర వేస్తాం.. పది కిలోమీటర్ల లోతున' అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ను తిడితే బాధలేదని, తెలంగాణ శాసనసభ్యుల్ని తిట్టడం అవమానకరమన్నారు. ఆ రెండు చానళ్లు ప్రసారాలను నిలిపివేసిన కేబుల్ ఆపరేటర్లకు తాను సెల్యూట్ చేస్తున్నానని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ శాసనసభ్యులంతా ఆ ఛానల్స్ పై సమిష్టిగా తీర్మానం చేశాయని, ఆ వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉందని, దానికి స్పందించిన ఎంఎస్ వో ఆ ఛానల్స్ ప్రసారాలు నిలిపివేశారని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై పలువురు మండిపడ్డారు. ప్రసారాల నిలిపివేతతో ప్రభుత్వానికి సంబంధం లేదని కెసిఆర్ అంటూ వచ్చారు. అయితే, కెసిఆర్ ప్రమేయం లేకుండా చానెల్ ప్రసారాలు నిలిపేయడం సాధ్యం కాదనే వాదనను ప్రతిపక్షాలు వినిపిస్తూ వచ్చాయి.
తెలంగాణ గడ్డపై ఉండాలంటే తెలంగాణకు సెల్యూట్ చేయాల్సిందేనంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ నేత, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎవరికీ తెలంగాణలో ఒకరికి సెల్యూట్ చేసి బతకాల్సిన అవసరం లేదని, దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా బతికే హక్కును రాజ్యాంగం కల్పించిందని బొత్స గుర్తు చేశారు.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మీడియా స్వేచ్చను ప్రతిఒక్కరూ గౌరవించాలి. అంతేకాని మీడియాను తొక్కిపెడతాం అనడం మచిది కాదు అని కెసిఆర్కు హితవు పలికారు. తోక్కేస్తాం పాతేస్తాం, మేడలు వంచేస్తాం అని హెచ్చరించడం భావ్యం కాదని అన్నారు.
మీడియా సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం నడుచుకోవాలని, ఇబ్బంది అనిపిస్తే ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయాలి. ఇలాంటి సున్నిత విషయాలలో ప్రభుత్వం నడిపే పెద్దలకు సహనం అవసరం అన్నారు. ప్రతిపక్షాలకు ప్రజలకు సముచిత స్థానం ఇస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని అన్నారు.
ఆ తర్వాత ఈ నిషేధంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర సమాచార ప్రసార శాఖ, ట్రాయ్ జూలై 24న ఎంఎస్ఓలకు నోటీసులు పంపాయి. ప్రసారాలను పునరుద్ధరించకపోతే కేబుల్ టీవీ నెట్వర్క్ నియంత్రణ చట్టం-1995 ప్రకారం ఎంఎస్ఓల లైసెన్సులు రద్దు చేస్తామని మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా హెచ్చరించారు. దీంతో టెలికాం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ తీర్పు మేరకు అక్టోబర్ 29 నుంచి టీవీ 9 ప్రసారాలను పునరుద్ధరించారు.
కానీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఇప్పటికీ పునరుద్ధరించలేదు. ఆనాటి నుంచి ఈరోజు వరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తన ప్రసారాలను పునరుద్ధరించేందుకు చేయని ప్రయత్నం లేదు. తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆ సంస్థ జర్నలిస్టులు నిరసన సైతం తెలిపారు.
అంతేకాదు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని సైతం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆశ్రయించింది. తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేస్తూ ఎంఎస్వోలు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిందంటూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంలో విచారణ చేసింది.
ఈ కేసుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎంఎస్వోలతో పాటు మరో 15 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్ సీపీ, ఎంఎస్వో అసోసియేషన్కు నోటీసులు అందజేసింది. వీటిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఏబీఎన్ దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించింది. మొదటి పిటిషన్లో రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారన్న ఏబీఎన్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఎంఎస్వోలు ప్రైవేటు వ్యక్తులైనా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలన్న ఏబీఎన్ వాదనను కోర్టు అంగీకరించింది.
న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ ఈ విషయంపై స్పందిస్తూ ఆర్టికల్ 19 ప్రకారం హక్కులను భంగం కలిగించేందుకు కాకుండా ఇంకా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అని ఆయన ప్రశ్నించారు. అలాగే తెలంగాణలో ప్రసారాలను పునరుద్దరించాలంటూ ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషన్పై కూడా స్పందించిన సుప్రీం ఎంఎస్వోలు సహా 15 మందికి సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.