ఆసియాకప్ కు ముందే భారత్-పాక్ గ్యాప్ ? పలకరించుకోని కెప్టెన్స్..!
ఆసియాకప్ 2025 టోర్నీ ఇవాళ్టి నుంచి ఆరంభమవుతోంది. అయినా అందరి చూపూ భారత్-పాకిస్తాన్ జట్ల పైనే. ఈ టోర్నీలో టైటిల్ కు ప్రధాన పోటీ దారులుగా ఉన్న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఈ నెల 14న దుబాయ్ లో కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో భారత్ ఆడొద్దంటూ స్వదేశంలో ఒత్తిడి పెరుగుతోంది. అయినా బీసీసీఐ మాత్రం ఈ మ్యాచ్ ఆడి తీరాలని నిర్ణయించింది. అదే సమయంలో ఆసియాకప్ ప్రారంభానికి ముందే భారత్-పాక్ మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఆసియాకప్ ప్రారంభ వేళ ఇవాళ టోర్నీలో ఆడుతున్న ఎనిమిది జట్ల కెప్టెన్లతో ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆలీ ఆఘాతో పాటు ఇతర జట్ల కెప్టెన్లు కూడా పాల్గొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు తమదైన శైలిలో జవాబులు కూడా ఇచ్చారు. ప్రెస్ మీట్ సందర్భంగా భారత్, పాక్ కెప్టెన్ల మధ్యలో ఆప్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కూర్చొన్నారు.

అయితే ప్రెస్ మీట్ ముగిశాక అన్ని జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం, మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇవాళ మాత్రం భారత్-పాక్ కెప్టెన్లు సూర్య కుమార్ యాదవ్, సల్మాన్ అలీ ఆఘా మాత్రం ఈ సంప్రదాయాన్ని పట్టించుకోలేదు. ప్రెస్ మీట్ ముగిసే సమయానికి భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తన పక్కనే కూర్చొన్న ఆప్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తో ముచ్చట్లలో మునిగిపోయారు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాత్రం లేచి ఆవైపు చూడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మిగతా జట్ల కెప్టెన్లు మాత్రం యథావిథిగా పలకరించుకున్నారు.

కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో భారత్ సంబంధాలు దారుణంగా క్షీణించాయి. దీంతో పాకిస్తాన్ తో ద్వైపాక్షిక టోర్నీలు ఆడకూడదని నిర్ణయించుకున్న భారత్.. బహుళ దేశాలు ఆడుతున్న టోర్నీ కావడంతో ఆసియాకప్ ఆడేందుకు వెళ్లింది. 14న జరిగే భారత్-పాక్ మ్యాచ్ ఆడకూడదని స్వదేశంలో ఒత్తిడి నెలకొంది. అయినా ఈ మ్యాచ్ ఆడి పాకిస్తాన్ ను ఓడించేందుకు భారత్ సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications