ఆసియా కప్ జట్టులో అనూహ్య మార్పులు.. ఆ స్టార్లకు షాక్!
ముంబై వేదికగా బీసీసీఐ ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆసియా కప్ 2025 కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఈ ఎంపికల్లో కొన్ని ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఆసియా కప్-2025 కోసం ఎంపిక చేసిన జట్టులో కీలక ఆటగాళ్లకు చోటు లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ మెగా టోర్నమెంట్కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. అయితే టీమ్లో చోటు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో కొన్ని కొత్త పేర్లు కనిపించగా.. మరికొందరు అనుభవజ్ఞులకు నిరాశ తప్పలేదు. ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఈ జట్టులో ప్రాధాన్యత లభించింది. ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభం కానుండగా, భారత్ తన మొదటి మ్యాచ్ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది.
గిల్కు వైస్ కెప్టెన్సీ
గత ఏడాది కాలంలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు పెద్దగా ఆడకపోయినప్పటికీ.. ఓపెనర్ శుభ్మన్ గిల్ వైస్-కెప్టెన్గా ఎంపిక కావడం ఒక ఆసక్తికరమైన నిర్ణయం. ఐపీఎల్ 2025లో శుభ్మన్ గిల్ నిలకడైన ప్రదర్శన, అలాగే ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో నాయకత్వ లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలు అప్పగించారు.

శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్లకు నిరాశ
ప్రస్తుత టీ20 క్రికెట్లో అద్భుత ఫామ్లో ఉన్న యువ సంచలనం యశస్వి జైస్వాల్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు జట్టులో స్థానం లభించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2023లో ఆస్ట్రేలియాతో చివరి టీ20 మ్యాచ్ ఆడిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతమైన ఫామ్తో తిరిగి జట్టులోకి వస్తాడని చాలామంది భావించారు. అయ్యర్ ఈ ఐపీఎల్ సీజన్లో 50.33 సగటుతో, 175 స్ట్రైక్ రేట్తో 604 పరుగులు చేసి తన జట్టును ఫైనల్కు చేర్చాడు. అయినప్పటికీ, అతనికి జట్టులో స్థానం దక్కలేదు.
యశస్వి జైస్వాల్ను ఓపెనింగ్ స్థానానికి బలమైన పోటీదారుగా భావించారు. అంతేకాకుండా, గత టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో అతను రిజర్వ్ ఓపెనర్గా ఉన్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు (43.00 సగటు, 159.71 స్ట్రైక్ రేట్తో 559 పరుగులు) చేసి సత్తా చాటాడు. అయినప్పటికీ అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇద్దరూ జట్టులో బలమైన పోటీదారులుగా ఉన్నప్పటికీ, తుది జాబితాలో వారి పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే యశస్వి జైస్వాల్ స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
వాషింగ్టన్ సుందర్:
ఆల్-రౌండర్గా ముఖ్యంగా తన ఆఫ్-స్పిన్తో జట్టుకు కీలకం కాగల వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో స్థానం కోల్పోయాడు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అతని ప్రదర్శన బాగా ఆకట్టుకుంది. అందుకే అతని ఎంపికను అందరూ ఊహించారు. కానీ సెలెక్టర్లు వేరే నిర్ణయం తీసుకున్నారు.
ప్రసిద్ధ్ కృష్ణ:
ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ, ఈ ఐపీఎల్లో 15 మ్యాచ్లలో 25 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ను గెలుచుకున్నాడు. ఇంత అద్భుతమైన ప్రదర్శన తర్వాత కూడా అతనికి జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం.
మహ్మద్ సిరాజ్:
ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ పేరు కూడా జట్టులో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం.
కీలక ఎంపికలు
వికెట్ కీపర్లు: వికెట్ కీపింగ్ బాధ్యతలను సంజు శాంసన్ ప్రధానంగా నిర్వర్తించనుండగా.. ఆర్సీబీ ఆటగాడు ఆటగాడు జితేష్ శర్మ బ్యాకప్గా ఎంపికయ్యాడు.
బౌలింగ్ విభాగం: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. బుమ్రాకు తోడుగా అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా పేస్ దళాన్ని బలోపేతం చేయనున్నారు. స్పిన్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యారు.
ఆసియా కప్ 2025 కోసం పూర్తి భారత జట్టు జాబితా ఇదే:
బ్యాటర్లు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్-కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్.
వికెట్ కీపర్లు: జితేష్ శర్మ, సంజు శాంసన్.
బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా.
స్టాండ్ బై ఆటగాళ్లు:
ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, యశస్వి జైస్వాల్.












Click it and Unblock the Notifications