నితీష్ కుమార్ రెడ్డికి మొండిచెయ్యి- ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టు ఇదే
Champions Trophy 2025: ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడబోయే భారత జట్టు వెల్లడైంది. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కేప్టెన్ రోహిత్ శర్మ కొద్దిసేపటి కిందటే ప్రకటించారు.
ఫిబ్రవరి 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం..
ఫిబ్రవరి 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య దేశం పాకిస్తాన్తో న్యూజిలాండ్ ఢీ కొడుతుంది. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. దుబాయ్, కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో ఈ మ్యాచ్లన్నీ షెడ్యూల్ అయ్యాయి.

గిల్కు ప్రమోషన్..
డాషింగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్కు ప్రమోషన్ లభించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే జట్టుకు అతను వైస్ కేప్టెన్గా అపాయింట్ అయ్యాడు. దాదాపుగా ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్తో సమానంగా భావించే ఈ జట్టులో రెండు తెలుగు రాష్ట్రాల ప్లేయర్లకు మొండిచెయ్యి చూపింది బీసీసీఐ.
నితీష్ కుమార్ రెడ్డికి..
అటు ఏపీకి చెందిన నితీష్ కుమార్ రెడ్డికి గానీ, అటు హైదరాబాద్కు చెందిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్కు గానీ చోటు దక్కకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో వీరిద్దరూ సత్తా చాటిన ప్లేయర్లే. అయినప్పటికీ- ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం ఎంపిక కాలేకపోయారు.
బుమ్రా ఆడేది కూడా అనుమానమే..
జస్ప్రీత్ బుమ్రా ఆడేది కూడా అనుమానమే. ఫిట్నెస్ సమస్యలతో అతను సతమతమౌతున్నాడు. వంద శాతం ఫిట్నెస్ సాధిస్తేనే బుమ్రా ఈ టోర్నమెంట్లో ఆడతాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు కూడా. కొంత విశ్రాంతి తరువాత..రిహాబిలిటేషన్ కోసం బుమ్రా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు సెలక్షన్ లో మహమ్మద్ సిరాజ్ కి అన్యాయం జరిగిందని భావిస్తున్నారా..? #MohammedSiraj #Siraj #RohitSharma #AjitAgarkar #TeamIndia #BCCI #CT2025 #ChampionsTrophy2025 #Oneindiatelugu
— oneindiatelugu (@oneindiatelugu) January 18, 2025
ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా..
ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఎంపికయ్యారు. వీరిద్దరితో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ను లీడ్ చేస్తారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో వెటరన్ బౌలర్ మహ్మద్ షమీకి చోటు దక్కింది. అర్ష్దీప్ సింగ్ అతనితో కలిసి కొత్త బంతిని పంచుకుంటాడు. ఫుల్ టైమ్ వికెట్ కీపర్గా రిషభ్ పంత్, పార్ట్ టైమర్గా కేఎల్ రాహుల్ ఆడతారు.
టీమ్ ఇదే..
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే జట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కేప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజాకు చోటు దక్కింది.












Click it and Unblock the Notifications