భారత్-పాక్ మ్యాచ్ లో గెలిచేదెవరు ? అంచనాలివే..! ఎంత స్కోరు చేస్తే ?
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారతే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుండగా.. కొత్త కుర్రాళ్లతో కూడిన పాకిస్తాన్ జట్టును కూడా తక్కువ అంచనా వేసేందుకు వీల్లేదని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. అన్నింటికీ మించి దుబాయ్ స్టేడియంలో పిచ్ కీలకంగా మారబోతోంది. ఈ పిచ్ పై ఎంత స్కోరు చేస్తే ఏం జరుగుతుందన్న దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడబోతోంది.
దుబాయ్ పిచ్ పై టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసే జట్టు 230 నుంచి 240 పరుగులు చేసే అవకాశం ఉంది. అలాగే రెండో ఇన్నింగ్స్ ఆడే జట్టు 240 నుంచి 250 పరుగుల వరకే చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మందకొడిగా మారుతున్న దుబాయ్ పిచ్ పై హార్డ్ హిట్టింగ్, పరిస్ధితులు కలిసివస్తే మినహా ఇంతకు మించి స్కోర్లు కష్టమే అంటున్నారు. అలాగే మ్యాచ్ లో టాస్ కీలకమే అయినా బౌలర్లు, బ్యాటర్లకూ పరిస్ధితులు సమానంగా కలిసి వస్తాయనే అంచనాలున్నాయి.

భారత్ టాస్ గెలిస్తే రోహిత్, గిల్ తో కూడిన ఓపెనింగ్ విభాగం కచ్చితంగా రెచ్చిపోవడం ఖాయం. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చే విరాట్ కొహ్లీకి పాకిస్తాన్ పై మంచి రికార్డు ఉంది. కేఎల్ రాహుల్ తో పాటు శ్రేయర్ అయ్యర్, హార్దిక్ పాండ్యా కూడా ఫామ్ లో ఉండటంతో టీమిండియా బ్యాటింగ్ పటిష్టంగానే ఉంది. అన్నింటికీ మించి భారత్ తొలి బ్యాటింగ్ చేస్తే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.
అలా కాకుండా పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సాద్ షకీల్ లేదా ఇమాముల్ హక్ బాబర్ ఆజమ్ తో ఓపెనింగ్ చేసే అవకాశముంది. కివీస్ తో మ్యాచ్ లో పాకిస్తాన్ ఓపెనింగ్ పేలవంగా ఉంది. మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ రిజ్వాన్ బ్యాటింగ్ లో దూకుడు కనిపించట్లేదు. కాబట్టి షమీ పేస్ బౌలింగ్ తొలి పవర్ ప్లేలో పాకిస్తాన్ కు కష్టంగా మారే అవకాశముంది. స్పిన్నర్ల విషయంలో ఇరుజట్లూ దాదాపు సమానంగానే కనిపిస్తున్నాయి. దీంతో బ్యాటింగ్ స్కోర్లే ఈ మ్యాచ్ కు డిసైడర్ గా మారబోతున్నాయి.












Click it and Unblock the Notifications