ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్న టీమిండియా టీ20 స్పెషలిస్ట్
దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో సౌత్ జోన్ కేప్టెన్ తిలక్ వర్మ నిరాశకు గురి చేశాడు. చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో అద్భుత పోరాటపటిమను ప్రదర్శించాడు. ఒంటరి పోరాటంతో జట్టును ఇబ్బందుల నుంచి గట్టెక్కించినప్పటికీ.. ఒక్క పరుగు దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 211 బంతులను ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 99 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అతను అవుట్ అయ్యాక సౌత్ జోన్ తొలి ఇన్నింగ్ ఎంతో సేపు కొనసాగలేదు. 336 పరుగులకు ఆలౌట్ అయింది. నాలుగో రోజు మధ్యాహ్నానికే ఈస్ట్ జోన్ తో 394 పరుగులు వెనుకంజలో ఉందీ జట్టు. సౌత్ జోన్ లో ఇద్దరు, ముగ్గరు మినహా మిగిలిన బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేదు. ఓపెనర్ రికి భుయ్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. నారాయణ్ జగదీశన్- 32, దేవ్ దత్ పడిక్కల్- 62, షేక్ రషీద్- 27, స్మరన్ రవిచంద్రన్- 23, శ్రేయాస్ గోపాల్- 26 పరుగులు చేశారు. చివర్లో చామా వీ మిలింద్ 43 పరుగులతో జట్టును ఆదుకున్నాడు.

ఈస్ట్ జోన్ లో ముఖేష్ కుమార్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. మహ్మద్ షమీ, ఖురేషీ, శిఖర్ మోహన్ రెండేసి చొప్పున వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్ లో ఈస్ట్ జోన్ 708 పరుగులకు ఆలౌట్ అయింది. కేప్టెన్ ఇషాన్ కిషన్ 270 పరుగులతో తడాఖా చూపాడు. కుమార్ కుశాగ్ర 101తో చెలరేగాడు.
ఈస్ట్ జోన్ కు ధీటుగా బదులివ్వలేకపోయింది సౌత్. తిలక్ వర్మ, దేవ్ దత్ పడిక్కల్, మిలింద్ మాత్రమే ప్రత్యర్థి బౌలర్లను ముప్పతిప్పలు పెట్టారు. ఈ క్రమంలో తిలక్ వర్మ శతకానికి చేరువ అయ్యాడు గానీ దాన్ని అందుకోలేకపోయాడు. 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు మహ్మద్ కౌనైన్ ఖురేషీ బౌలింగ్లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీ ఫైనల్ లో సెంచరీకి ఒక పరుగు దూరంలో ఇలా దురదృష్టకరంగా అవుట్ కావడం విస్మయానికి గురిచేసింది.
దులీప్ ట్రోఫీ ఆరంభం నుండి తిలక్ వర్మ అసాధారణంగా ఆడుతున్నాడు. అత్యుత్తమ ఫామ్ను కనబరుస్తోన్నాడు. ఈ సీజన్ సెమీఫైనల్ తొలి ఇన్నింగ్స్లో 250 బంతుల్లో అజేయంగా 116 పరుగులు చేయడమే కాకుండా, రెండో ఇన్నింగ్స్లో కూడా 79 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇప్పుడు మళ్లీ ఫైనల్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో కీలక ప్రదర్శన చేసి, తన జట్టుకు బ్యాటింగ్లో సెంచరీకి చేరువ అయ్యాడు.













Click it and Unblock the Notifications
