రోహిత్ అవుట్: అనఫిషియల్ రిటైర్మెంట్?: కేప్టెన్గా బుమ్రా: భారత జట్టులో భారీ మార్పులు
IND vs AUS: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భారత్- వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్లల్లో 2-1తో వెనుకంజలో ఉంది. ప్రత్యేకించి- మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్లో ముగిసిన నాలుగో టెస్ట్ మ్యాచ్లో అవమానకర ఓటమిని చవి చూడాల్సొచ్చింది.
ఈ బీజీటీ సిరీస్లో తొలి మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది టీమిండియా. రెండో మ్యాచ్లో ఓడిపోయింది. మూడో టెస్ట్ డ్రాగా ముగియగా.. నాలుగో దాంట్లో మళ్లీ పాత పాటే పాడింది. పరాజయాలకు అలవాటు పడ్డామనే విషయాన్ని బహిర్గతం చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. వంటి బ్యాటర్లు సైతం మట్టికరిచారీ గేమ్లో.

ఈ పరిస్థితుల మధ్య చివరిదైన అయిదో టెస్ట్ మ్యాచ్ కోసం సన్నద్ధమౌతోంది భారత్. జనవరి 3వ తేదీన ఆరంభం కానుందీ గేమ్. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. ఇందులో గెలిస్తే గానీ సిరీస్ సమం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో భారత్ విజయకేతనం ఎగురవేస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది.
ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. మెల్బోర్న్ నుంచి ఇప్పటికే సిడ్నీకి చేరుకుంది జట్టు. నెట్ సెషన్స్లో పాల్గొంటోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్లో ముమ్మరంగా ప్రాక్టీస్ సాగిస్తోంది. జట్టు ప్లేయర్లందరూ అందుబాటులో ఉన్నారు. కఠోరంగా శ్రమిస్తోన్నారు.
కాగా ఈ మ్యాచ్కు కొన్ని గంటల ముందు రోహిత్ శర్మ నిర్ణయం తీసుకున్నాడు. సిడ్నీ మ్యాచ్ ఆడుకూడదని నిర్ణయించుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం కానున్నాడు. బోర్డర్- గవాస్కర్ సిరీస్లో వరుస వైఫల్యాల బారిన పడిన నేపథ్యంలో ఆతను ఈ నిర్ణయం తీసుకున్నాడనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేని విషయం.
వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్ట్లో ఆడలేదు. దానికి జస్ప్రీత్ బుమ్రా కేప్టెన్గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్ గెలుచుకుంది టీమిండియా.
రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్లో 3, మలి ఇన్నింగ్లో 6 పరుగులతో సరిపెట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఆ మ్యాచ్ను 10 వికెట్ల తేడాతో కోల్పోవాల్సి వచ్చింది.
మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్లో అతను చేసింది 10 పరుగులే. మ్యాచ్ డ్రా అయనందున రెండో ఇన్నింగ్ ఆడాల్సిన అవసరం రాలేదు. నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్లో 3, రెండో ఇన్నింగ్లో 9 పరుగులకే వెనుదిరిగాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు.
ఈ పరిణామాల మధ్య అయిదో టెస్ట్ మ్యాచ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు కేప్టెన్గా వ్యవహరించనున్నాడు. అలాగే ఓపెనర్గా కేఎల్ రాహుల్ క్రీజ్లో దిగే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్ ఆరంభించవచ్చు.
రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్ తుదిజట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వెన్నునొప్పి వల్ల సిడ్నీ టెస్ట్కు దూరమైన ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్కు బదులుగా మరో బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆడబోతున్నాడు. అతను జట్టుకు అందుబాటులో ఉన్నాడు.












Click it and Unblock the Notifications