చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్: 36 ఏళ్లయింది మరి
IND vs NZ: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఘన విజయాన్ని సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ను మట్టికరిపించింది. టీమిండియా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని కొట్టి అవతల పడేశారు బ్లాక్ క్యాప్స్. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది.
36 సంవత్సరాల తరువాత భారత్లో భారత్పై టెస్ట్ మ్యాచ్ గెలవడం న్యూజిలాండ్కు ఇదే తొలిసారి. చివరిసారిగా 1988లో వాంఖెడే స్టేడియంలో టెస్టుల్లో భారత్ను ఓడించింది న్యూజిలాండ్. అంతకుముందు 1969లో ఓ మ్యాచ్ గెలిచింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్పై స్వదేశంలో గెలవడం మొత్తంగా ఇది మూడోసారి.

మూడు టెస్ట్ మ్యాచ్ల ఈ సిరీస్లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యతను సాధించింది. రెండో టెస్ట్ ఈ నెల 24వ తేదీన పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆరంభమౌతుంది. చివరి గేమ్ నవంబర్ 1వ తేదీన జరుగుతుంది. ముంబైలోని వాంఖెడే స్టేడియం దీనికి వేదిక. ఈ రెండింటినీ గెలుచుకుంటేనే సిరీస్ భారత్ వశమౌతుంది.
తొలి ఇన్నింగ్లో భారత్ తడబడిన విషయం తెలిసిందే. 46 పరుగులకే కుప్పకూలింది. మాట్ హెన్రీ-5, విలియ్ ఒ రోక్- 4 వికెట్లతో చెలరేగిపోయారు ఆ ఇన్నింగ్లో. అయిదుమంది బ్యాటర్లు డకౌట్ అయ్యారంటే బౌలింగ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రిషభ్ పంత్ చేసిన 20 పరుగులే అత్యధికం.
భారత బ్యాటర్లు విఫలమైన అదే పిచ్పై తొలి ఇన్నింగ్లో న్యూజిలాండ్ చెలరేగింది. 402 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర 134 పరుగులతో దుమ్ము దులిపాడు. డెవాన్ కాన్వే-91, లోయర్ ఆర్డర్ బ్యాటర్ టిమ్ సౌథీ 65 పరుగులు చేయడంతో భారీ స్కోర్ను సాధించింది.

రెండో ఇన్నింగ్లో భారత ఆరంభం అద్దిరిపోయినప్పటికీ- చివరి సెషన్లో తడబడింది. 408 పరుగుల వద్ద నాలుగో వికెట్ను కోల్పోయిన టీమిండియా 462 పరుగులకు ఆలౌట్ అయింది. సర్ఫరాజ్ ఖాన్ చేసిన 150, రిషభ్ పంత్ వీరోచితంగా ఆడిన 99 పరుగులకు విలువ లేకుండా పోయింది.
మొత్తంగా 107 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచింది టీమిండియా. చివరి రోజున మధ్యాహ్న భోజన విరామ సమయం కంటే ముందే దీన్ని కొట్టేశారు కివీస్ బ్యాటర్లు. జట్టు ఖాతా తెరవకముందే ఓపెనర్ టామ్ లాథమ్, 35 పరుగుల వద్ద డెవాన్ కాన్వే అవుట్ కావడంతో ఇండియా క్యాంప్లో ఆశలు సజీవంగా నిలిచినప్పటికీ.. అది నీరుగారడానికి ఎంతో సేపు పట్టలేదు.
తొలి ఇన్నింగ్ సెంచరీ హీరో రచిన్ రవీంద్ర, మరో ఓపెనర్ విల్ యంగ్ భారత బౌలింగ్కు ఎదురొడ్డి నిలిచారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. సమయానుకూలంగా భారీ షాట్ల ఆడారు. రచిన్ రవీంద్ర ఆరు ఫోర్లతో 39, విల్ యంగ్ ఒక సిక్సర్, ఏడు ఫోర్లతో 48 పరుగులతో నాటౌట్గా నిలిచారు.












Click it and Unblock the Notifications