పాకిస్తాన్ తో అంటే ఓకే.. ఇప్పుడు బంగ్లాదేశ్ తో కూడానా: నో షేక్ హ్యాండ్ ప్లీజ్
క్రికెట్ లో హిస్టరీ రిపీట్ అయింది. గతంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల కేప్టెన్లు షేక్ హ్యడ్ ఇచ్చుకోలేదు. రక్తం అంటిన చేతులను తాకడానికి ఇష్టపడట్లేదని వివరణ ఇచ్చింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అప్పట్లో. ఫైనల్స్ గెలిచాక పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మొహసిన్ నక్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ను అందుకోవడానికీ ఇష్టపడలేదు భారత జట్టు. ఈ వివాదం చాలాకాలం పాటు కొనసాగింది.
తాజాగా అలాంటి పరిస్థితే మళ్లీ ఎదురైంది. ఈ సారి భారత అండర్- 19 జట్టు దీనికి వేదిక అయింది. అప్పుడు పాకిస్తాన్ కాగా.. ఇప్పుడు బంగ్లాదేశ్. అండర్ - 19 మ్యాచ్ సందర్భంగా భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే, బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్తో కరచాలనం నిరాకరించాడు. జింబాబ్వేలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలను ప్రతిబింబించినట్టయింది.

బంగ్లాదేశ్ కేప్టెన్ ఎండి అజీజుల్ హకీమ్ తమీమ్ అనారోగ్యంతో ఉండటంతో అబ్రార్ టాస్ వచ్చాడు. టాస్ గెలిచి బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాక కూడా మాత్రే- అబ్రార్ కరచాలనం చేసుకోలేదు. కళ్ళలోకి కూడా చూసుకోకుండా పక్కనుండి వెళ్ళారు. షేక్ హ్యాండ్ సంగతి అటుంచితే కనీసం పలకరించుకోనూ లేదు వారిద్దరూ. జాతీయ గీతాలాపన సమయంలోనూ ఆటగాళ్లు పరస్పరం మాట్లాడుకోలేదు. పట్టనట్టుగా వ్యవహరించారు.
భారత్- బంగ్లాదేశ్ క్రీడా సంబంధాల్లో ఈ పరిస్థితి తలెత్తడానికి కారణాలు లేకపోలేదు. ఐపీఎల్ 2026 కోసం కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కొనుగోలు చేయడంపై దేశంలో తలెత్తిన నిరసనలే. ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ ఆడటానికి బీసీసీఐ నిరాకరించింది. అతన్ని తక్షణమే జట్టు నుంచి విడుదల చేయాలని సూచించింది. దీని తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్యంగా స్పందించింది.
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను ఆడటానికి తమ జట్టును భారత్ కు పంపించడానికి నిరాకరించింది. బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్ లన్నింటినీ కూడా శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసారాన్ని కూడా నిలిపివేస్తోన్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు అండర్- 19 జట్ల కేప్టెన్లు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి, పరస్పరం మాట్లాడుకోవడానికి నిరాకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications