Jay Shah: ఐసీసీ ఛైర్మన్ గా జై షా ? త్వరలో బీసీసీఐకి గుడ్ బై...!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా ఉన్న జై షా త్వరలో ఆ పదవికి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 సెప్టెంబర్ నుంచి బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న షా.. ఈసారి ఐసీసీ ఛైర్మన్ పదవిపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం బీసీసీఐ పదవిని వదులుకునే దిశగా అడుగులేస్తున్నారు. గతంలో భారత్ నుంచి జగ్ మోహన్ దాల్మియా, శరద్ పవార్ వంటి వారు ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టారు.
ఎలాంటి క్రికెట్ అనుభవం లేకపోయినా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఉన్న జై షా.. 2015లో బీసీసీఐ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. 2019 నాటికి బీసీసీఐ కార్యదర్శిగా మారిపోయారు. ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్ రేసలోకి వెళ్లారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న బీసీసీఐకి కీలకమైన కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన్ను.. ఐసీసీకి నామినేట్ చేసేందుకు బోర్డు పెద్దలు కూడా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఐసీసీ అధ్యక్ష పదవికి ఈ ఏడాది నవంబర్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. నాలుగేళ్లుగా ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న గ్రెగ్ బార్క్ లే పదవీకాలం నవంబర్ లో పూర్తవుతుంది. అయితే ఆయనకు రెండోసారి ఐసీసీ ఛైర్మన్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ప్రతిష్టాత్మక పదవిని బీసీసీఐ కోరుకుంటే మాత్రం ఆయనకు పొడిగింపు దక్కకపోవచ్చు.ఈ నెలలో కొలంబోలో ఐసీసీ కీలక వార్షిక సమావేశం జరగబోతోంది. ఇందులో ఛైర్మన్ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారు. అయితే ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానా లేదా అనే దానిపై షా ఇప్పటివరకూ స్పందించలేదు. అయితే అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో వివాదాల తర్వాత ఐసీసీ ప్రక్షాళనకు సిద్దమవుతోంది.












Click it and Unblock the Notifications