Title Sponsor: టీమిండియాకు భారీ షాక్..! స్పాన్సర్లే కరవు..!
బీసీసీఐ (BCCI) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. టీమిండియా (Team India) మ్యాచ్ లు ఆడుతుందంటే స్పాన్సర్లు ఎగబడతారు. అది స్వదేశంలో అయినా, విదేశాల్లో అయినా పోటీ మాత్రం తీవ్రంగానే ఉంటుంది. కానీ ఈసారి స్వదేశంలో భారత జట్టు ఆడే మ్యాచ్ లు, సిరీస్ లకు స్పాన్సర్లు దొరకడం లేదట. ఈ సీజన్ లో టీమిండియా ఆడే మ్యాచ్ లు ఖరారైనా, వాటికి టైటిల్ స్పాన్సర్లు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో బీసీసీఐ ఇంకా టైటిల్ స్పాన్సర్ల (Title Sponsor) కోసం వేటలోనే ఉంది.
భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్ల కోసం కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్ లకు టైటిల్ స్పాన్సర్ గా బిడ్ దాఖలు చేయడానికి ఆగస్టు 13 వరకూ గడువు ఇచ్చారు. జూలై 20నే బీసీసీఐ ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. అయినా స్పాన్సర్లు మాత్రం ముందుకు రాలేదు. దీంతో ప్రస్తుతం బోర్డు.. ఆసక్తి చూపుతున్న కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్పిన్నీ ఎస్బీఐ లైఫ్ కూడా ఉన్నట్లు సమాచారం.

క్రిక్బజ్ తాజా నివేదిక ప్రకారం బీసీసీఐ.. టీమిండియా స్వదేశీ మ్యాచ్ లపై ఆసక్తి చూపుతున్న కార్పొరేట్ సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఈ మధ్య అనేక క్రీడా ఈవెంట్లలో సందడి చేస్తున్న జనరేటివ్ AI బ్రాండ్ గూగుల్ జెమిని కూడా చర్చల్లో ఉన్న వాటిలో ఒకటిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టైటిల్ స్పాన్సర్ హక్కులు కలిగి ఉన్న IDFC ఫస్ట్ బ్యాంక్ ఒక్కో మ్యాచ్కు రూ.4.2 కోట్లు చెల్లిస్తోంది. అయితే పెంచిన కనీస ధర రూ.4.75 కోట్లు ఒప్పందం కుదరడంలో అడ్డంకిగా మారినట్లు కనిపిస్తోంది. 2023లో IDFC ఫస్ట్ బ్యాంక్ కుదుర్చుకున్న మూడేళ్ల ఒప్పందంతో పోలిస్తే, ఇప్పుడు ప్రతిపాదించిన ఒప్పందం రెండేళ్ల కాలానికి మాత్రమే ఉంటుంది. ఈ ఒప్పందాన్ని దక్కించుకునే సంస్థ దాదాపు 35 మ్యాచ్లకు (10 టెస్టులు, 12 వన్డేలు మరియు 13 T20లు) స్పాన్సర్గా వ్యవహరించాల్సి ఉంటుందని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇవే స్పాన్సర్ల కరవుకు అసలు సమస్యలుగా కనిపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications