IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ!
ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ఊహించని షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అనూహ్యంగా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ (26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78) విధ్వంసకర బ్యాటింగ్తో ఆర్సీబీని చిత్తు చేశాడు.
క్రీజులో ఉన్నంత సేపు ఆర్సీబీ బౌలర్లను వీడియో గేమ్ ఆడాడు. వరల్డ్ బెస్ట్ పేసర్లు అయిన జోష్ హజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్లను ఆడుతున్నాననే బెరుకు లేకుండా విరుచుకుపడ్డాడు. దాంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది.
బుడ్డోడి విధ్వంసం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులే చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్(40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. విరాట్ కోహ్లీ(16 బంతుల్లో 7 ఫోర్లతో 32), వెంకటేశ్ అయ్యర్(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 29 నాటౌట్) పర్వాలేదనిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/33), రవి బిష్ణోయ్(2/32), బ్రిజేశ్ శర్మ(2/37) రెండేసి వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ(1/47), రవీంద్ర జడేజా(1/14) చెరో వికెట్ తీసారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 18 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీ(26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78), ధ్రువ్ జురెల్(43 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 81 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(2/44), కృనాల్ పాండ్యా(2/30) రెండేసి వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు చేతులెత్తేసారు. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇదే తొలి పరాజయం. గత రెండు మ్యాచ్ల్లో గెలిచిన ఆర్సీబీ.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చేతిలో ఓటమిపాలైంది.
15 ఏళ్ల కుర్రాడి చేతిలో ఓటమి..
వరుసగా వికెట్లు కోల్పోవడం ఆర్సీబీ విజయవకాశాలను దెబ్బతీసింది. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో ఇతర బ్యాటర్లు ఒత్తిడికి లోనై వికెట్లు పారేసుకున్నారు. చివరకు ఎక్స్ట్రా బ్యాటర్ కోసం ఇంపాక్ట్ ప్లేయర్గా వెంకటేశ్ అయ్యర్ను బరిలోకి దించింది. ఈ వ్యూహం ఫలించినా బౌలింగ్ బలహీనంగా మారింది. వెంకటేశ్ బరిలోకి దిగడంతో సుయాశ్ శర్మ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది.
ఈ తప్పిదాలకు తోడు వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడటంతో ఆర్సీబీ చేతులెత్తేసింది. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ.. ఫాస్టెస్ట్ సెంచరీ దిశగా సాగాడు. కానీ అతన్ని కృనాల్ బోల్తా కొట్టించడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైభవ్ ధాటికి పవర్ ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 97 పరుగుల భారీ స్కోర్ చేసి మ్యాచ్ను తమవైపు తిప్పుకుంది. వైభవ్ విధ్వంసానికి విరాట్ కోహ్లీ కూడా స్టన్ అయ్యాడు.












Click it and Unblock the Notifications