RCB vs MI: కొంపముంచిన భువీ.. ముంబై ఎలిమినేట్
ఐపీఎల్ 2026 సీజన్లో రాయపూర్లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై విజయం సాధించింది. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఓడిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబైకి భువనేశ్వర్ కుమార్ ధాటికి ఓపెనర్ రికెల్టన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్గా వెనుతిరిగారు. రోహిత్ శర్మ 22 పరుగులకే నిష్క్రమించగా, యువ బ్యాటర్లు తిలక్ వర్మ (57), నమన్ ధీర్ (47) ఆదుకున్నారు. వీరి బాధ్యతాయుతమైన ఆటతీరుతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు పడగొట్టాడు.
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభం తడబాటుగానే ఉంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ కాగా, జాకబ్ బెథెల్ (27), పడిక్కల్ (12) కూడా త్వరగానే ఔటయ్యారు. ఈ దశలో కృనాల్ పాండ్యా 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో అద్భుతమైన 73 పరుగులు చేసి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు.మ్యాచ్ చివరి ఓవర్కు చేరేసరికి ఆర్సీబీ విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ, చివరి మూడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన స్థితిలో భువనేశ్వర్ కుమార్ ఒక భారీ సిక్సర్ బాదాడు. అనంతరం చివరి బంతికి మరో రెండు పరుగులు చేయడంతో బెంగళూరు 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది.

బౌలింగ్లో 4 కీలక వికెట్లు తీసి, బ్యాటింగ్లో చివరి బంతికి మ్యాచ్ ఫినిష్ చేసిన భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ విజయంలో అసలైన హీరోగా నిలిచాడు. ఈ ఓటమితో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలను కోల్పోయింది. మరోవైపు, ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.












Click it and Unblock the Notifications