India vs Sri Lanka: శ్రీలంక పోరుకు హ్యాట్సాఫ్..! భారత్ గెలవాల్సిన మ్యాచ్ డ్రా..!
రెండు రోజులుగా ఉత్కంఠ భరితంగా మలుపులు తిరుగుతూ భారత్-శ్రీలంక క్రికెట్ అభిమానుల్ని ఉవ్విళ్లూరించిన కొలంబో టెస్టు చివరికి డ్రాగా ముగిసింది. కొలంబోలో జరిగిన భారత్-శ్రీలంక రెండో టెస్టు (India-Sri Lanka second Test) తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసిన టీమిండియా.. అంతే వేగంగా శ్రీలంకను తొలి ఇన్నింగ్స్ లో కుప్ప కూల్చింది. దీంతో ఇక తమ పని అయిపోయిందని అనుకుందో ఏమో.. ఫాలో ఆన్ లో పడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంకను అడ్డుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీని ఫలితమే భారత్ గెలవాల్సిన మ్యాచ్ కాస్తా డ్రా (Draw) చేసుకుని బయటపడింది.
తొలి ఇన్నింగ్స్ లో పడిక్కల్, ధృవ్ జురెల్ సెంచరీలతో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసిన భారత్.. పటిష్ట స్దితిలో నిలిచింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చేశారు. అయినా సోనల్ దినూష సెంచరీతో ఆదుకోవడంతో 290 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఫాలో ఆన్ లో పడ్డ శ్రీలంకను భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు ఆహ్వానించింది. రెండో ఇన్నింగ్స్ లోనూ 63 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో ఉన్న శ్రీలంక అనూహ్యంగా పుంజుకుంది. అక్కడి నుంచీ ఒక్కో పరుగూ జోడించుకుంటూ పోయింది.

ఈ క్రమంలో ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినూష మరోసారి సెంచరీతో దుమ్మురేపాడు. పసిందు సూర్యభండార 92, నువంత 46 పరుగులు చేసి అతనికి అండగా నిలిచారు. దీంతో ఇవాళ ఐదు రోజు ఆట ముగిసే సమయానికి 133 పరుగులతో దినూష నాటౌట్ గా నిలవడమే కాకుండా భారత్ కు విజయాన్ని దూరం చేశాడు. భారత బౌలర్లు అతన్ని అవుట్ చేయడంలో దారుణంగా విఫలమయ్యారు. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 9 వికెట్లకు 429 పరుగులు చేసి మ్యాచ్ ను డ్రాగా ముగించింది. చివరి వికెట్ తీయలేక అపసోపాలు పడ్డ భారత్ గెలిచే మ్యాచ్ ను కాస్తా డ్రాకు అంగీకరించాల్సి వచ్చింది. భారత బౌలర్లలో జడేజా, మానవ్ సుతార్ తలో మూడు వికెట్లు తీశారు. పేసర్లు ప్రసిద్ధ్, సిరాజ్ ఒక్కో వికెట్ మాత్రమే తీసారు.














Click it and Unblock the Notifications