టీమిండియాలో భారీ మార్పులు..: ముగ్గురు స్టార్ ప్లేయర్లు అవుట్?
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ మరో ఓటమిని మూటగట్టుకుంది. గెలిచాల్సిన మ్యాచ్ ఓడిపోయింది. చేతుల దాకా వచ్చిన మ్యాచ్ ను నోటి దాకా తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమైంది. మూడో టెస్ట్ మ్యాచ్ లో 22 పరుగుల తేడాతో మట్టికరిచింది. అయిదు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తేడాతో వెనుకంజలో నిలిచింది.
లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ లో విజయానికి అవసరమైన 192 పరుగులను అందుకోవడంలో విఫలమైంది టీమిండియా. 170 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్ లో సత్తా చాటిన బ్యాటర్లందరూ రెండో ఇన్నింగ్ లో చేతులెత్తేశారు. నిర్లక్ష్యపు ఆటతీరును ప్రదర్శించారు. ఓటమిని కొని తెచ్చుకున్నారు.

యశస్వి జైస్వాల్- 0, కేఎల్ రాహుల్- 39, కరుణ్ నాయర్- 14, శుభ్ మన్ గిల్- 6, ఆకాష్ దీప్- 1, రిషభ్ పంత్- 9, వాషింగ్టన్ సుందర్- 0, నితీష్ కుమార్ రెడ్డి- 13, జస్ ప్రీత్ బుమ్రా- 5, మహ్మద్ సిరాజ్- 4 పరుగుుల చేశారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒక్కడే పోరాట పటిమ ప్రదర్శించాడు. 61 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఈ పరిస్థితుల మధ్య నాలుగో టెస్ట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది భారత్. ఈ మ్యాచ్ ఈ నెల 23వ తేదీన ఆరంభం కానుంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం దీనికి వేదిక. ఇందులో ఆడబోయే తుదిజట్టులో భారీ మార్పులకు టీమ్ మేనేజ్మెంట్ తెర తీయనుంది.
వరల్డ్ నంబర్ వన్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాను పక్కన పెట్టడం పెట్టొచ్చు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా అతనికి విశ్రాంతి ఇచ్చే అవకావం ఉంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్.. కూడా బుమ్రా విశ్రాంతి గురించి ఇదివరకే స్పందించారు. ఇంగ్లాండ్ లో బుమ్రా మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతాడని ధృవీకరించారు.
బుమ్రా ఇప్పటికే మూడు మ్యాచ్ లల్లో రెండింట్లో ఆడినందున నాలుగో టెస్ట్ కు దూరం పెట్టొచ్చు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 4 వరకు లండన్ ఓవల్ స్టేడియంలో జరిగే చివరి మ్యాచ్ కోసం అతన్ని రిజర్వ్ గా ఉంచవచ్చు.
బుమ్రాతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా మాంచెస్టర్ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. లార్డ్స్ టెస్టు తొలిరోజు ఆటలో పంత్ వేలికి గాయం కావడంతో తొలి ఇన్నింగ్స్లో 34 ఓవర్ల తర్వాత కీపింగ్ చేయలేదు. పంత్ గాయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ అతను ఆడకపోతే ధ్రువ్ జురెల్ తుది జట్టులో అతడి స్థానంలో ఆడతాడు.
కరుణ్ నాయర్ స్థానం కూడా ప్రమాదంలో పడింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లల్లో ఆకట్టుకోలేకపోయాడు. అతని స్థానంలో సాయి సుదర్శన్ కు తుది జట్టులో చోటు దక్కొచ్చు. ఇంగ్లాండ్తో జరిగే 4వ టెస్టు తుదిజట్టులో- యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కేప్టెన్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్ ఆడొచ్చు.












Click it and Unblock the Notifications