వింబుల్డన్ టవల్స్.. మేడ్ ఇన్ ఇండియా? తయారీలో ఇంత రహస్యం ఉందా?
వింబుల్డన్ టోర్నీలో క్రీడాభిమానులు నొవాక్ జకోవిచ్, నోమీ ఒసాకా వంటి టెన్నిస్ స్టార్ల ఆటతో పాటు టీవీ స్క్రీన్లపై అందరినీ ఆకర్షించే మరో ప్రత్యేకమైన వస్తువు కూడా ఉంది. అదే టెన్నిస్ ప్లేయర్లు ఉపయోగించే రంగురంగుల వింబుల్డన్ టవల్స్. టోర్నీ అంతటా ప్లేయర్లు ఉపయోగించే ఈ అధికారిక టవల్స్ వింబుల్డన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వస్తువులలో ఒకటిగా మారాయి. సాధారణ టవల్స్కు భిన్నంగా అవి అమూల్యమైన జ్ఞాపకాలుగా మారాయి. చాలా మంది ఆటగాళ్లు తమ మ్యాచ్ లు ముగిసిన అనంతరం టోర్నీ గుర్తుగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ వింబుల్డన్ టవల్స్కు ఇండియాతో సంబంధం ఉంది. లండన్ వేదికగా జరిగే ఈ టోర్నమెంట్ అధికారిక టవల్స్ అన్నీ మన దేశంలోనే.. గుజరాత్లోని వాపిలో ఉన్న ఓ టెక్స్టైల్ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి.
భారతీయ దారంతోనే టవల్స్ తయారీ
బ్రిటన్కు చెందిన ప్రముఖ లగ్జరీ హోమ్ టెక్స్టైల్ బ్రాండ్ 'క్రిస్టీ'.. 1987 నుంచి వింబుల్డన్ టోర్నీకి అధికారిక టవల్స్ అందిస్తోంది. ఒకప్పుడు బ్రిటన్లోనే జరిగే ఈ టవల్స్ తయారీ.. సుమారు 15 ఏళ్ల క్రితం భారతీయ టెక్స్టైల్ దిగ్గజం 'వెల్స్పన్' ఈ క్రిస్టీ సంస్థను కొనుగోలు చేయగా.. అప్పటి నుంచి ఇండియాలో ఈ టవల్స్ ఉత్పత్తి అవుతున్నాయి. అప్పటి నుంచి 'వెల్స్పన్' సంస్థ ఈ ఐకానిక్ టవల్స్ తయారీని బ్రిటన్ నుంచి గుజరాత్లోని వాపిలో ఉన్న తమ అత్యాధునిక తయారీ కేంద్రానికి క్రమంగా తరలించింది.

18 నెలల ముందే మొదలయ్యే డిజైన్
ఈ వింబుల్డన్ టవల్స్ తయారీ ప్రక్రియ అంత సులువుగా పూర్తి కాదు. దీని వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది. వింబుల్డన్ టోర్నీ ప్రారంభం కావడానికి 18 నెలల ముందే వీటి డిజైన్ ప్రక్రియ మొదలవుతుంది. రాబోయే సీజన్లో ఎలాంటి కలర్ ట్రెండ్స్, ఫ్యాషన్ డిజైన్ల గురించి డిజైన్ బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. టవల్ డిజైన్ ఖరారు అయిన అనంతరం.. ప్రతి ఒక్క టవల్ను నేయడానికి ఓ వారం రోజుల సమయం పడుతుంది. ఈ టవల్స్ కలర్ కోడింగ్ కూడా ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. ప్రతి ఏడాది పురుషుల టోర్నీ కోసం ఉపయోగించే టవల్స్ ను వింబుల్డన్ సాంప్రదాయ రంగులైన ముదురు ఆకుపచ్చ, ఊదా, బంగారు రంగుల కాంబినేషన్లోనే తయారు చేస్తారు. అయితే మహిళల టోర్నీ టవల్స్ విషయంలో మాత్రం ప్రతి ఏడాది సరికొత్త కలర్ స్కీమ్ ను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది మహిళల టవల్స్ కోసం ఎరుపు, తెలుపు రంగుల కలయికను డిజైన్ చేశారు.
ఆటగాళ్లకు ఇష్టమైన జ్ఞాపికగా నిలుస్తోన్న టవల్స్
ఈ టవల్స్ నాణ్యత అద్భుతంగా ఉంటుంది. క్రిస్టీ బ్రాండ్ సిగ్నేచర్ షార్ట్-లూప్ టెర్రీ వీవ్ పద్ధతిలో ప్రీమియం కాటన్ నూలుతో వీటిని తయారు చేస్తారు. అందువల్ల ఈ టవల్స్ ఎంతో మృదువుగా ఉండటమే కాకుండా శరీరంలోన చెమటను వేగంగా పీల్చుకుని త్వరగా ఆరిపోతాయి. ఎన్నిసార్లు ఉతికినా టవల్స్ మృదుత్వం దెబ్బతినదు. టెన్నిస్ ప్లేయర్లకు ఈ టవల్స్ అంటే ఎంత ఇష్టమంటే.. మ్యాచ్ ముగిసిన అనంతరం వీటిని ఓ అపురూపమైన జ్ఞాపికగా తమ కిట్ బ్యాగుల్లో సర్దుకుని ఇంటికి తీసుకెళ్లిపోతుంటారు. నొవాక్ జకోవిచ్, ఇగా స్వియాటెక్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఈ టవళ్లను తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు గిఫ్ట్ లుగా ఇవ్వడానికి దాచుకుంటామని గతంలో సరదాగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications