వైఎస్కు చెక్ మీద చెక్
పట్టుమని పది మంది అనుచరులు కూడా లేని కె. కేశవరావును వైఎస్ ఉద్దేశపూర్వకంగా పిసిసి అధ్యక్షుడిని చేశారు. ఆ పదవిలో శక్తమంతుడైన నాయకుడు ఉంటే తనకు ఎసరు వస్తుందని వైఎస్ భయం. కానీ అంత బలహీనుడైన కేశవరావు పిసిసి అధ్యక్షుడైన తర్వాత చాలా బలపడ్డారు. ఆయన సోనియాగాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా మారారు. ఆయన ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్నందు వల్ల వైఎస్ శిబిరంలో ఆందోళన కనిపిస్తోంది. ఆయన రాజ్యసభకు వెళ్ళిన తర్వాత కెకెను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించమని రాజశేఖరరెడ్డి సోనియాగాంధీని అడిగే అవకాశముంది. కేశవరావు ఇక ముందు ఏకు మేకు కావడం దాదాపు ఖాయం. ఈ పరిస్ధితుల్లో వైఎస్ వళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించవలసి ఉంటుంది.
త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగవలసి ఉంది. కొత్త మంత్రుల ఎంపికలో కూడా వైఎస్కు ఇంతకు ముందు ఉన్నంత స్వేచ్ఛ ఉండకపోవచ్చు. కెవిపి రామచంద్రరావు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడిపిస్తున్న వైఎస్ ఇక మీదట అదే ధోరణి కొనసాగిస్తారో లేదో వేచి చూడాలి. మొండి స్వభావం కలిగిన వైఎస్ అధిష్టానవర్గానికి తలొగ్గే అవకాశాలు తక్కువ. ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఇక మీదట విజృంభించే అవకాశముంది.