వైఎస్కు చెక్ మీద చెక్
హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఇక మీదట జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఆయన చిరకాల మిత్రుడు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనుక నుంచి నడిపిస్తున్న డాక్టర్ కెవిపి రామచంద్రరావుకు రాజ్యసభ సభ్యత్వం ఇప్పించుకోవడానికి వైఎస్ విఫల యత్నం చేశారు. ఇప్పటివరకు అధిష్టానవర్గం వద్ద వైఎస్ ఆడింది ఆట, పాడింది పాటగా ఉండేది. మంత్రుల ఎంపిక వద్ద నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు వైఎస్, కెవిపిల ఇష్టానుసారంగానే నియామకాలు జరిగాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల కేటాయింపులో భారీగా అవినీతి జరిగిందని, కోట్లాది రూపాయలు చేతులు మారారయన్న ఆరోపపణలపై కాంగ్రెస్ అధిష్టానవర్గం జరిపిన ప్రాధమిక విచారణలో వైఎస్కు వ్యతిరేకంగా నివేదిక వచ్చినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. ఈసారి రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్న వారిలో ఎవరూ వైఎస్కు గట్టి అనుచరులు కాకపోవడం విశేషం.
పట్టుమని పది మంది అనుచరులు కూడా లేని కె. కేశవరావును వైఎస్ ఉద్దేశపూర్వకంగా పిసిసి అధ్యక్షుడిని చేశారు. ఆ పదవిలో శక్తమంతుడైన నాయకుడు ఉంటే తనకు ఎసరు వస్తుందని వైఎస్ భయం. కానీ అంత బలహీనుడైన కేశవరావు పిసిసి అధ్యక్షుడైన తర్వాత చాలా బలపడ్డారు. ఆయన సోనియాగాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా మారారు. ఆయన ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్నందు వల్ల వైఎస్ శిబిరంలో ఆందోళన కనిపిస్తోంది. ఆయన రాజ్యసభకు వెళ్ళిన తర్వాత కెకెను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించమని రాజశేఖరరెడ్డి సోనియాగాంధీని అడిగే అవకాశముంది. కేశవరావు ఇక ముందు ఏకు మేకు కావడం దాదాపు ఖాయం. ఈ పరిస్ధితుల్లో వైఎస్ వళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించవలసి ఉంటుంది.
త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగవలసి ఉంది. కొత్త మంత్రుల ఎంపికలో కూడా వైఎస్కు ఇంతకు ముందు ఉన్నంత స్వేచ్ఛ ఉండకపోవచ్చు. కెవిపి రామచంద్రరావు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడిపిస్తున్న వైఎస్ ఇక మీదట అదే ధోరణి కొనసాగిస్తారో లేదో వేచి చూడాలి. మొండి స్వభావం కలిగిన వైఎస్ అధిష్టానవర్గానికి తలొగ్గే అవకాశాలు తక్కువ. ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఇక మీదట విజృంభించే అవకాశముంది.












Click it and Unblock the Notifications